బయ్యారం/ చేర్యాల, ఆగస్టు 4 : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో చోటచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటకు చెందిన యువరైతు శెట్టె రామస్వామి(38) తనకున్న మూడెకరాల భూమిలో పత్తి, వరి సాగుచేస్తూ.. ఆవులను పెంచుతున్నాడు. ఇల్లు, పశువులషెడ్ నిర్మాణం, బోర్లు వేయడంతో రూ.5 లక్షలకు పైగా అప్పులయ్యాయి. పంటలు పండకపోవడంతో అప్పు ఎలా తీర్చాలోనని సతమతమవుతూ సోమవారం పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చెరువులో మృతదేహం కన్పించడంతో స్థ్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు ఎస్సై అపూర్వరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి తల్లి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగరానికి చెందిన భూక్యా హరిదాస్ (55) సాగుతోపాటు కొడుకు చదువు కోసం రూ.30 లక్షల వరకు అప్పుచేశాడు. పంట సరిగా పండక, తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 2న ఇంట్లో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కొడుకు భూక్యా బాసు ఫిర్యాదు మేరకు ఎస్సై టీ ప్రశాంత్బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.