పాకాల చెరువుకు వస్తున్న గోదావరి జలాలు, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు, పీఎన్జీ సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖాన నర్సంపేట సొంతం. నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. రామప్ప నుంచి పాకాల చెరువుకు గోదావరి జలాలు తరలించే నిర్మాణాలను రూ.330 కోట్లతో పూర్తి చేసి, రంగాయ ప్రాజెక్టు రూ.305కోట్లతో నిర్మించగా, రెండు పంటలకు సాగునీరు అందుతున్నందున ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. పంట ఉత్పత్తుల నిల్వకు అన్ని మండలాల్లో గోదాముల నిర్మాణాలు చేపట్టారు. నర్సంపేట పట్టణంలో ఇంటింటికీ పీఎన్జీ కనెక్షన్లు వచ్చాయి. రూ.77కోట్లతో 250 పడకల జిల్లా స్థాయి దవాఖాన, పల్లెదవాఖానలు, హెల్త్ సబ్సెంటర్లకు పక్కా భవనాల్లో కొన్ని పూర్తయ్యా యి. ఎఫ్బీవో రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. సబ్సిడీ మోటర్లు, ట్రాక్టర్లు, పాడిగేదెల పంపిణీ, చెక్డ్యామ్ల నిర్మాణంతో రైతులకు ప్రోత్సాహం లభిస్తోంది.
– నర్సంపేట, మార్చి 25
నర్సంపేట, మార్చి 25: స్వరాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు.
పల్లె, పట్టణాల విద్యుద్దీకరణ
నర్సంపేట నియోజకవర్గంలో పట్టణాలు, పల్లెల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. మధ్య స్తంభాలు, లూజ్ వైర్, మూడో వైర్ వేసే పనులు చేశారు. అవసరమైనచోట కొత్త లైన్లు కూడా వేశారు. కొత్త కాలనీలకు వైర్లు, స్తంభాలను బిగించారు. పాత స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు, 133కేవీ సబ్స్టేషన్లను నిర్మించారు. దీనివల్ల కరెంటు సరఫరాలో సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి.
పట్టణ అభివృద్ధికి రూ.50కోట్లు
నర్సంపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50కోట్లు మంజూరు చేసింది. దీంతో పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయి. పట్టణంలో ఫ్రూట్స్, వెజిటేబుల్, ఫిష్, మటన్ మార్కెట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూరగాయల మార్కెట్ కూడా నిర్మించారు. పది కిలోమీటర్లు సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, కూడళ్ల సుందరీకరణ చేస్తున్నారు. తొమ్మిది కిలోమీటర్ల అంతర్గత రోడ్ల పనులు ఇప్పటికే పూర్తి చేశారు. నర్సంపేటలో పాకాల ఆడిటోరియం నిర్మాణం కూడా పూర్తయ్యింది. పార్క్ నిర్మిస్తున్నారు. నర్సంపేటలో బస్తీ దావాఖానను ఏర్పాటు చేశారు. కరోనాకు సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ను మంజూరు చేశారు. మూడు కిలోమీటర్లు సీసీ బైపాస్ రోడ్డు నిర్మించారు. పట్టణంలో కొత్తగా మూడు పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మించారు. కమ్యూనిటీహాల్ నిర్మించారు. తాగునీటి కోసం 5లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు కట్టారు. ఆర్డబ్ల్యూఎస్ భవనాన్ని నిర్మించారు.
నర్సంపేటకు గోదావరి జలాలు
ధాన్యగారంగా పేరొందిన పాకాల చెరువుకు గోదావరి జలాలను తీసుకువచ్చారు. రూ.330కోట్లతో నిర్మాణ పనులు చేపట్టగా రామప్ప నుంచి పాకాల వరకు సాగునీటిని రప్పించారు. రంగాయ ప్రాజెక్టుకు రూ.305 కోట్లు వెచ్చించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకాలకు నిధులను ఎమ్మెల్యే పెద్ది పట్టుబట్టి తీసుకుని వచ్చారు. సీఎం కేసీఆర్ చొరవతో పాకాల, రంగాయ ప్రాజెక్టులకు నీటిని తీసుకునివచ్చారు. పాకాల, రంగాయ ప్రాజెక్టుల నుంచి గోదావరి జలాలు నర్సంపేట నియోజకవర్గానికి వస్తున్నాయి. దీంతో రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతోంది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగి నర్సంపేట ప్రాంతం సస్యశ్యామలం అవుతున్నది.
అంతటా జలకళ
నర్సంపేటలో కొత్తగా ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నీటి నిల్వను పెంచే 13 చెక్డ్యాంలను మంజూరు చేశారు. నర్సంపేటలో మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్బండ్గా ఏర్పాటు చేశారు. బోటింగ్ సౌకర్యం కల్పించారు. ఎస్సారెస్పీ డీబీఎం 38, 40, 46 ద్వారా 46,333 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో నాలుగు విడుతల్లో రూ.66కోట్లతో 374 చెరువులను అభివృద్ధి చేశారు. దీంతో 30,287 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
హెల్త్ సబ్సెంటర్లు
గ్రామాలకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా 49 హెల్త్ సబ్సెంటర్ల నిర్మిస్తున్నారు. కరోనా కాలంలో హెల్త్ సబ్సెంటర్లకు భవనాలు అద్దెకు ఇవ్వాలంటే జంకారు. దీంతో పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాలు హెల్త్ సబ్ సెంటర్లను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అన్ని సబ్ సెంటర్లకు ప్రత్యేక భవనాలు సమకూరాయి.
పల్లె దవాఖానలు
పల్లెలకు ఆస్పత్రులు మంజూరయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మండల కేంద్రాల్లో ఉన్నందున గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పల్లె దవాఖానలను ప్రారంభించి, వైద్యుల పోస్టులను మంజూరు చేశారు. వైద్య సిబ్బందిని కేటాయించారు. మందులు, పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు అందుబాటులో ఉండి మందులను అందిస్తున్నారు. నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
గిరిజన సైనిక్ స్కూల్
పాకాల అశోక్నగర్లో గిరిజన సైనిక్ స్కూల్ భవనాన్ని నిర్మించారు. ఇందులో డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ బాలబాలికల పాఠశాలలు, కళాశాలలు కూడా మంజూరయ్యాయి. న్యాక్ ద్వారా యువజన మహిళా నిరుద్యోగులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువత కోసం బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దారు.
రైతు సంఘాలు
ఎఫ్బీవోలను (రైతు ఆహార ఉత్పత్తి సంఘాలు) నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఎఫ్బీవోల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను పంపిణీ చేశారు. విత్తన ఉత్పత్తి కేంద్రాలను నర్సంపేట, బుధరావుపేటలో మంజూరు చేశారు. నూతన వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నారు. మిర్చి పరిశోధన స్థానానికి స్థలసేకరణను చేపట్టారు.
లక్ష మెట్రిక్ టన్నుల గోదాంలు
రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం గతంలో లేదు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే పెద్ది నర్సంపేట నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే గోదాముల నిర్మాణానికి చొరవ చూపారు. ప్రతి మండలంలోనూ నిర్మాణం చేపట్టగా కొన్నిచోట్ల పూర్తి పూర్తయ్యాయి. మరికొన్నిచోట్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతూ చివరి దశకు చేరాయి. గోదాముల నిర్మాణంతో రైతులకు గిట్టుబాటు ధర రాని సమయంలో గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
రైతులకు ట్రాక్టర్ల పంపిణీ
రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడేలా ట్రాక్టర్లను పంపిణీ చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భూమి గల రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందించారు. దుక్కులు దున్నడానికి, పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ ట్రాక్టర్లను పైలెట్ ప్రాజెక్టు కింద ఒకేసారి నియోజకవర్గానికి తీసుకుని వచ్చి మంత్రుల చేతులమీదుగా పంపిణీ చేశారు.
పాడి గేదెల పంపిణీ
నర్సంపేట నియోజకవర్గంలో భూమి లేని నిరుపేద ఎస్సీలకు పైలెట్ ప్రాజెక్టు కింద పాడి గేదెల పంపిణీ పథకాన్ని చేపట్టారు. పాడి గేదెలను ఇతర రాష్ర్టాల్లో కొనుగోలు చేసి తీసుకువచ్చి లబ్ధిదారులకు అందించారు. పాల ఉత్పత్తితో ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇంటింటా పీఎన్జీ సౌకర్యం..
నర్సంపేట పట్టణంలో పీఎన్జీ సౌకర్యం కల్పించారు. పట్టణం నుంచే పైప్లైన్ వెళ్తుండగా ఎమ్మెల్యే పెద్ది ఇంటింటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా చొరవ చూపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నర్సంపేట పట్టణానికి ఈ సౌకర్యం ఉండేలా చేశారు. వినియోగదారులకు వంట గ్యాస్ సౌకర్యం అందించేందుకు వీలుగా పట్టణంలోని పలు వీధుల్లో గ్యాస్ పైప్లైన్ పనులు పూర్తి చేశారు. వినియోగదారులు గ్యాస్ కనెక్షన్లు కూడా తీసుకుంటున్నారు. ఇంటింటికీ గ్యాస్ పథకం ఎంతో ఉపయోగపడుతున్నది.
రైతులకు సబ్సిడీ మోటర్లు
రైతులకు సబ్సిడీపై వ్యవసాయ మోటర్లను అందిస్తున్నారు. బోర్లు, బావులు ఆధారంగా రైతులకు వీటిని అందజేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా నర్సంపేట ప్రాంతంలోని రైతులకు 50శాతం సబ్సిడీపై కరెంటు మోటర్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 5,010 యూనిట్లు అందిస్తున్నారు. దీనికిగాను రూ.15కోట్లు మంజూరు చేశారు. దీనిలో రూ.7.51కోట్లు సబ్సిడీ అందిస్తున్నారు. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
జిల్లా స్థాయి దవాఖాన
నర్సంపేటకు రూ.77కోట్లతో జిల్లా దవాఖాన మంజూరైంది. జిల్లా దవాఖానతో నర్సంపేట ప్రాంతానికి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. దవాఖాన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 244 మంది వైద్యులు, సిబ్బంది పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 250 పడకలు ఏర్పాటు చేయనున్నారు. గత ఏరియా ఆస్పత్రి స్థానంలో జిల్లా స్థాయి ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ కూడా మంజూరైంది. భవన నిర్మాణం, పరికరాల కోసం రూ.3కోట్లు మంజూరు చేశారు. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి వచ్చే పరీక్షలు చేసి, ఆన్లైన్లో ఫలితాలను పంపనున్నారు. 50రకాల పరీక్షలను చేయనున్నారు. నర్సంపేటలో రోగులకు అందుబాటులో ఉండేలా దీన్ని నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా నర్సంపేటలో కిడ్నీ రోగులకు డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేశారు.
రోడ్ల నిర్మాణం
నర్సంపేట – నెక్కొండ రోడ్డుపై ముగ్ధుంపురం వద్ద బ్రిడ్జి నిర్మించారు. నల్లబెల్లి, నెక్కొండలో డబుల్ రోడ్డు వేశారు. ఆర్అండ్బీ ద్వారా 192.83 కిలోమీటర్ల రోడ్లను రూ.98.60కోట్లతో నిర్మించారు. పీఎంజీఎస్వైలో బీటీ రోడ్లను వేశారు. 100 కిలోమీటర్ల అంతర్గత బీటీ రోడ్లు పడ్డాయి. సబ్ప్లాన్లో 54 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేశారు. అందులో తండాలకు బీటీ రోడ్లు వేశారు.
దళితబంధు పథకం
దళితబంధు పథకంలో ఎస్సీలకు 100 యూనిట్లు పంపిణీ చేశారు. గతంలో కూలీ పనులకు వెళ్లిన వారు దళితబంధుతో యజమానులుగా మారుతున్నారు. దళితబంధు పథకంతో రోజూ వ్యాపారాలు చేస్తున్నారు. దళితబంధుతో ఆర్థికంగా ఎదుగుతున్నారు. దళిత కుటుంబాలు ఈ పథకంతో
ఆర్థికంగా ఎదుగుతున్నాయి.
పామాయిల్ సాగు
రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నది. ఈమేరకు నర్సంపేట నియోజకవర్గంలో దీని సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. సబ్సిడీపై పామాయిల్ మొక్కలను అందిస్తున్నది. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం, దుగ్గొండి మండలాల్లో పామాయిల్ సాగు కూడా చేస్తున్నారు. పామాయిల్ పంటలకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలను అందిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 29 రైతువేదికలను నిర్మించారు.