వరంగల్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : వ్యవసాయశాఖ అధికారులు యాసంగి పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 1,95,992 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో ప్రధానంగా వరి, మక్కజొన్న పంటలు ఉంటాయని తాజాగా ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. 1,04,485 ఎకరాల్లో వరి, 86,235 ఎకరాల్లో మక్కజొన్న పంట సాగులోకి రావొచ్చని పేర్కొన్నారు. కొద్దిరోజుల నుంచి వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో యాసంగి పంటల సాగుపై అంచనా వేశారు. అందుబాటులో ఉన్న నీటితో రైతులు వరి, జొన్న, మక్కజొన్న, పెసర, మినుము, శనగ, మిరప, కూరగాయలు, పత్తి, వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు తదితర పంటల సాగుకు సన్నద్దం అవుతున్నట్లు గుర్తించారు. యాసంగి పంటలు సాగులోకి వచ్చే విస్తీర్ణంలో 50 శాతానికి పైగా వరి పంట ఉండే అవకాశం ఉందని నిర్దారణకు వచ్చారు. వరి, 1,04,485, జొన్న 136, మక్కజొన్న 86,235, పెసర 117, మినుము 69, శనగ 193, మిరప 2,743, కూరగాయలు 1,467, పత్తి 10, వేరుశనగ 447, నువ్వు 23, పొద్దుతిరుగుడు 17, ఇతర పంటలు మరో 50 ఎకరాల్లో సాగులోకి వస్తాయని అంచనా వేశారు. యాసంగి వరి పంట సాగు విస్తీర్ణంలో జిల్లాలో పర్వతగిరి మండలం ప్రథమ, రాయపర్తి మండలం ద్వితీయ స్థానంలో ఉంటుందని తమ అంచనా నివేదికలో తెలిపారు. పర్వతగిరిలో 15,420, రాయపర్తిలో 15,200 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేసే చాన్స్ ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత మండలాల వారీగా వరి పంట ఖానాపురంలో 13,560, వర్ధన్నపేటలో 12,900, నెక్కొండలో 9,850, చెన్నారావుపేటలో 7,659, సంగెంలో 7,400, నర్సంపేటలో 6,100, నల్లబెల్లిలో 5,750, దుగ్గొండిలో 5,100, గీసుగొండలో 2,896, ఖిలావరంగల్లో 2,400, వరంగల్లో 250 ఎకరాల్లో వరి పంట సాగులోకి రానుందని తెలిపారు. మక్కజొన్న పంట సాగులో గీసుగొండ ప్రథమ, దుగ్గొండి ద్వితీయ స్థానంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. మండలాలా వారీగా గీసుగొండలో 14,245, దుగ్గొండిలో 11,500, చెన్నారావుపేట 10,720, నెక్కొండ 10,400, సంగెం 10,250, నల్లబెల్లి 10,200, పర్వతగిరి 7,250, నర్సంపేట 5,300, ఖానాపురం 2,700, వర్దన్నపేట 1,050, వరంగల్ 900, రాయపర్తిలో 220 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు.
యాసంగి 2,743 ఎకరాల్లో మిరప పంటను సాగు చేయడానికి రైతులు సిద్ధమైనట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా నర్సంపేట మండలంలో 1,750 ఎకరాల్లో మిరప పంట సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత మండలాల వారీగా చెన్నారావుపేటలో 784, ఖానాపురం 80, సంగెం 30, నెక్కొండ 30, గీసుగొండ 22, పర్వతగిరి16, వర్ధన్నపేట 15, రాయపర్తి 12, నల్లబెల్లిలో 4 ఎకరాల్లో మిరప పంటను రైతులు సాగు చేయనున్నారని తెలిపారు. కాయగూర పంటలు మండలాలవారీగా గీసుగొండలో 475, సంగెం 375, వర్ధన్నపేట 25, రాయపర్తి 25, పర్వతగిరి 27, ఖిలావరంగల్ 150, వరంగల్ 40, దుగ్గొండి 145, నల్లబెల్లి 10, నర్సంపేట 120, ఖానాపురం 35, చెన్నారావుపేట 10, నెక్కొండలో 30 ఎకరాల్లో సాగుకు అవకాశం ఉందని యాక్షన్ ప్లాన్లో వివరించారు. వేరుశనగ పంట మండలాల వారీగా గీసుగొండ 45, సంగెం 15, వర్ధన్నపేట 55, రాయపర్తి 38, పర్వతగిరి 53, ఖిలావరంగల్ 20, వరంగల్ 20, దుగ్గొండి 85, నల్లబెల్లి 25, నర్సంపేట 40, ఖానాపురం 16, చెన్నారావుపేట 20, నెక్కొండలో 15 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సన్నద్దం అవుతున్నట్లు తెలిపారు. గీసుగొండ, సంగెం, రాయపర్తి, వరంగల్, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ మండలాల్లో శనగ, నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, నల్లబెల్లి, సంగెం, గీసుగొండ మండలాల్లో జొన్న, వర్ధన్నపేట, గీసుగొండ, రాయపర్తి, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో పెసర పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గీసుగొండ మండలంలోని రైతులు కొందరు 10 ఎకరాల్లో యాసంగి పత్తి పంట సాగుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు. ప్రణాళిక మేరకు రైతులకు విత్తనాలను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేపట్టారు.