ఏటూరునాగారం, ఫిబ్రవరి 27 : ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది. ఏటూరునాగారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్పై పనిచేస్తున్న మండల సర్వేయర్ బొచ్చు మహేందర్ భూమి కొలతల విషయంలో రైతు నుంచి లంచం తీసుకుంటూ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వరంగల్ ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ వివరాలు వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన రైతు ఎర్రబెల్లి మనోహర్రావు(ఎన్ఆర్ఐ) రాంనగర్ ప్రాంతంలో తనకు ఉన్న భూమిలో 5.34 ఎకరాలను కూతురుకు వాటాగా ఇచ్చాడు. కాగా, ఈ భూమి ని పక్కనున్న వారు ఆక్రమించుకున్నారని, సర్వే చేయాలంటూ గతేడాది మే నెలలో దరఖాస్తు చేసుకున్నా డు. తిరిగి జనవరి నెలలో మళ్లీ సర్వే కోసం దరఖాస్తు చేశా డు. ఈ నెల 6వ తేదీన భూమి సర్వే కోసం సర్వేయర్ మహేందర్ కలువగా, రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి, సర్వే చేసిన అనంతరం తీసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సర్వే చేసిన అనంతరం ముం దుగా ఒప్పుకున్న ప్రకారం రైతు ఎర్రబెల్లి మనోహర్రావు నుంచి పంచాయతీ రాజ్ కార్యాలయం సమీపంలో రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహేందర్ను అదుపులోకి తీసుకున్న మండల రెవెన్యూ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించినట్లు తెలుస్తున్నది. దాడుల్లో శ్యాం సుం దర్, శ్రీను, రవితో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
రెండు నెలలుగా సతాయిస్తున్నాడు
తన కుమార్తె శశిలతకు 5.34ఎకరాల భూమిని ఇచ్చానని, సర్వే కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లు బాధిత రైతు ఎర్రబెల్లి మనోహర్రావు తెలిపారు. గతేడాది మే నెలలో భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో సర్వేయర్ తన భూమి వద్దకు వచ్చి ‘మీకేదో పంచాయతీ ఉందంట కదా.. పెద్ద మనుషుల్లో కూర్చొని సెటిల్ చేసుకోండి’అని చెప్పి వెళ్లిపోయాడన్నారు. తమ కు ఎలాంటి పంచాయతీలు లేవని చెప్పినప్పటికీ సర్వేయర్ వినలేదన్నారు. కాగా, తిరిగి జనవరి నెలలో మళ్లీ మీ సేవ లో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నా, సర్వే చేయకుండా రెండు నెలలుగా సతాయిస్తుండడంతో తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తహసీల్దార్ కూడా సర్వే చేయాలని సూచించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. సర్వే కోసం సర్వేయర్ మహేందర్ రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇస్తామని చెప్పినప్పటికీ సర్వే చేయకుండా రెండు, మూడు వారాలుగా సతాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో వి సుగుచెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు.