హనుమకొండ సబర్బన్, జూలై 29 : ఏదైనా వినూత్నంగా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితముంటుంది. ఆలానే ఆలోచించి ఇక్కడో వన సంరక్షకుడు తమ ఊరి నర్సరీని పండ్ల మొక్కల ఫ్యాక్టరీగా మలిచాడు. తీరొక్క పండ్ల మొక్కలు ఇంటింటికీ అందిస్తూ వాటి బాగోగులు కూడా చూసుకుంటున్నాడు. త్వరలోనే ఆ ఊరిలో రకరకాల పండ్లు ప్రజల చేతికి అందనుండగా నర్సరీ నిర్వాహుడిని అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.
రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగ ఏటా హరిత హారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. కోట్లాది మొక్కలు నాటిస్తూ సంరక్షిస్తున్నది. ఈ క్రమంలో అడవుల శాతం క్రమంగా పెరుగుతున్నది. ఇదే ఊపుతో రాష్ట్రంలో మరిన్ని ఫలితాల కోసం ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేస్తూ మొక్కలను అందుబాటులో ఉంచుతున్నది. నర్సరీల్లో అన్నీ నీడనిచ్చే మొక్కలతోపాటు, కొన్ని రకాల పూల మొక్కలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఎల్కతుర్తి మండల పరిధిలోని దండెపల్లి నర్సరీలో మాత్రం తీరొక్క రకాల పండ్ల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. కేవలం ప్రైవేట్ నర్సరీల్లో మాత్రమే లభించే డ్రాగన్ ఫ్రూట్, కాజూ, అంజీర్, ఓగ్గాయ, నిమ్మ, బ్లూ బెర్రీ, అంగూర్, నల్ల సీతాఫలం లాంటి మొక్కలతో పాటు వంటింటికి కావాల్సిన దాల్చిన చెక్క మొక్కలు కూడా ఇక్కడ లభ్యమవడం విశేషం. ఇవే కాకుండా అనేక రకాల పూల మొక్కలు సైతం అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా నర్సరీల్లో పెంచిన మొక్కలను ఇంటింటికీ తిరిగి పంచినా నాటుకునేందుకు ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటిది ఈ గ్రామ నర్సరీకి మాత్రం గ్రామస్తులే స్వయంగా వచ్చి తమకు ఫలానా మొక్క కావాలని అడిగి మరీ తీసుకెళ్తున్నారు. దీనివెనుక నర్సరీ సంరక్షకుడు వంగ రవి అలియాస్ రమేశ్ కృషి దాగి ఉంది. మొక్కలకు అంటు కట్టడంలో శిక్షణ పొందిన రవి, బయటకు వెళ్లి రకరకాల మొక్కలు తీసుకొచ్చి నర్సరీలో అంటు కట్టి వృద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నాడు. గ్రామానికి చెందిన కోదాటి సుధీర్రావు అనే ప్రకృతి ప్రేమికుడికి తోడు అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు కూడా ప్రోత్సహించడంతో నర్సరీని రవి అద్భుతంగా తీర్చిదిద్దాడు. తనకు కావాలనుకున్న మొక్కల కోసం ఎంత దూరమైనా వెళ్లి తీసుకొస్తాడు. రవి చలువతో మరి కొద్ది రోజుల్లో దండెపల్లిలో ఇంటింటా పలు రకాల ఫలాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి తాళ్లపెళ్లి అఖిల సైతం ఇష్టారీతిన కాకుండా క్రమ పద్ధతిలో మొక్కలు పంపిణీ చేస్తున్నారు. కేవలం మొక్కలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా తీసుకున్న వారి ఇంటికి వెళ్లి మరీ మొక్క పెరుగుతున్న తీరును కూడా రవి పర్యవేక్షిస్తున్నాడు.
అందరి ప్రోత్సాహంతోనే
మా ఊరి నర్సరీని వినూత్నంగా తీర్చి దిద్దడంలో మా ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరి ప్రోత్సాహం ఉన్నది. ముఖ్యంగా మొక్కలపై నాకు మా గ్రామానికి చెందిన సుధీర్రావు వల్లే ఆసక్తి ఏర్పడింది. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో మొక్కలు అంటు కట్టే విధానంపై శిక్షణ తీసుకున్నా. మా వ్యవసాయ భావి వద్ద కూడా కొన్ని మొక్కలను అంటుగట్టి పెంచుతున్నా.
– వంగ రవి, నర్సరీ సంరక్షకుడు, దండెపల్లి