రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో వరంగల్ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నది. దేవాదుల ప్రాజెక్టు పూర్తి ప్రయోజనాలు ఉమ్మడి జిల్లాకే దక్కేలా ఏర్పాట్లు చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుతో 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అలాగే, కొన్ని రిజర్వాయర్ల కింద సాంకేతిక కారణాలతో సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి కొత్తగా పనులు చేపట్టింది. హనుమకొండ, జనగామ జిల్లాలోని 24 గ్రామాల పరిధిలో కొత్తగా 7740 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇటీవల సాగునీటి శాఖ టెండర్లు పిలిచింది.
వరంగల్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్ 21న నగరానికి వచ్చినప్పుడు వరంగల్ అర్బన్(హనుమకొండ) జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బరాజ్ పూర్తయ్యాయని, ఇకపై ప్రతి ఎకరా కూ సాగునీరు అందిస్తామని ప్రకటించారు. దేవాదు ల ప్రాజెక్టు పూర్తికావడంతో 7.5 టీఎంసీల నీరు ఏడాది మొత్తం అందుబాటులో ఉంటుందని చెప్పా రు. ‘ఇప్పటి నుంచి దేవాదుల ప్రాజెక్టు వరంగల్కే అంకితం. ప్రతి గ్రామం, ప్రతి చెరువుకు నీరు చేరాలని, ప్రత్యేకంగా రూ.100 కోట్ల గ్రాంటు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా దీనికి అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, సంగెం ప్రాంతాల్లో ఎక్కడా ఒక్క ఊరు మిగిలిపోవద్దు’ అని ఆదేశించారు. ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులు సర్వే చేసి పనులను ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఆమోదించింది. ప్రస్తుతం రూ.90.06 కోట్లతో పనుల కోసం టెండర్ల ప్రక్రియ మొదలైంది.
దేవాదుల ఆయకట్టులోని ప్రతి ఎకరాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేలా ప్రభుత్వం తాజాగా మూడు మినీ లిఫ్ట్ స్కీము పనులను చేపట్టింది. ఒకటో మినీ లిఫ్ట్ కింద గండిరామా రం రిజర్వాయర్ వద్ద పంపుహౌస్, ప్రెజర్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇక్కడి నుంచి కన్నారం చెరువుకు పైపులైన్, అక్కడి నుంచి గ్రావిటీతో బంజరుపల్లి చెరువుకు వరకు గోదావరి నీళ్లు చేరేలా పనులు చేపట్టా రు. ప్రెజర్ మెయిన్కు 9.38 కిలోమీటర్లు పైపులైన్.. కన్నారం, బంజరుపల్లి చెరువులకు కలిపి 9.63 కిలో మీటర్ల పైపులైన్ పనులు చేయాలని టెండరులో పే ర్కొన్నారు. ఈ పనులతో 10 గ్రామాల్లోని 62 చెరువులకు నీరు చేరుతుంది. వీటి పరిధిలోని 3,389 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండో మినీ లిఫ్ట్ కింద ధర్మసాగర్-గండిరామారం రిజర్వాయర్ల మ ధ్య పైపులైన్ను గుండ్లసాగర్ నుంచి లోక్యతండా వర కు పైపులైన్ను మరో 3.50 కిలోమీటర్లు కొనసాగించేలా పనులు చేపట్టారు. దీంతో వేలేరు, ముప్పారం చెరువులకు సాగునీరు చేరుతుంది. ఈ పనులతో 2,812 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుంది. మూడో మినీ లిఫ్ట్ కింద నష్కల్ రిజర్వాయర్ వద్ద పంపుహౌస్తో పాటు ఇక్కడి నుంచి పైపులైన్ పనులను టెండరులో పేర్కొన్నారు. 11 కిలో మీటర్ల ఈ పైపులైన్తో వంగలపల్లి, ధర్మాపూర్, మల్లక్పల్లి, వెంకటాపూర్లోని చెరువులకు నీరు చేరుతుంది.