రేగొండ, జనవరి 5 : మతిస్థిమితం తప్పిన ఓ కొడుకు ఆగ్రహంతో ఊగిపోతూ కన్నతల్లినే రోకలిబండతో కొట్టిచంపాడు. అడ్డుగా వచ్చిన మరో మహిళపైనా దాడి చేయగా ఆమె చావు బతుకుల మధ్య దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. కుటుంబసభ్యులు, చిట్యాల సీఐ వేణుచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజిరెడ్డి, పదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటినుంచి వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో నెల రోజులుగా మళ్లీ పిచ్చిగా ప్రవర్తిస్తూ కుటుంబసభ్యులతో తరచూ గొడవపడుతూ కొట్టేవాడు. గురువారం రాత్రి కూడా కుటుంబసభ్యులపైకి ఆగ్రహంతో ఊగిపోయాడు. చంపుతాడేమోనన్న భయంతో రాజిరెడ్డి భార్య, అమ్మమ్మ, అమ్మ కలిసి ఒక గదిలోనే తలుపులు గడియపెట్టుకొని ఉండిపోయారు. ఈ క్రమంలో తలుపులు తీయాలంటూ రాజిరెడ్డి గొడవ పడ్డాడు.
ఇంటిని, ఇంటి ఆవరణలో ఉన్న వరి గడ్డిని తగులబెట్టానని బెదిరించడంతో అతడి తల్లి హైమ(63) భయపడి తలుపు తీయగా రోకలిబండతో ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. రాజిరెడ్డి భార్య తప్పించుకోగా ఏదో గొడవ జరుగుతున్నదని చూసి అక్కడికి వచ్చిన పక్కింటి మహిళ జ్యోతిపైనా అతడు దాడి చేశాడు. అనంతరం రోకలిబండ, గొడ్డలి చేత పట్టుకొని గ్రామంలో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రేగొండ ఎస్సై శ్రీకాంత్రెడ్డి చేరుకొని 108 అంబులెన్స్లో జ్యోతిని వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. రాజిరెడ్డి చిన్నకోడెపాకలో కనిపించడంతో గ్రామస్తులు తాళ్లతో బంధించినట్లు తెలుసుకొన్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేదు నమోదు చేయగా, భూపాలపల్లి డీఎస్పీ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.