వరంగల్, 19 : బీఆర్ఎస్ నేతల ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం ఆయనతోపాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిశామని, ఆ ఫొటో వాడుకొని ఒకవర్గం మీడియా, ప్రతిపక్షాలు తాము అరూరిపై చేసినట్లు అసత్య ప్రచారం చేశాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అరూరితో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి పనిచేస్తున్నామన్నారు. ఇది గిట్టని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు, ప్రజలు నమ్మొద్దని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రైతుబంధు హనుమకొండ కో ఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ ఉదయరెడ్డి, చంద్రమోహన్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, చింతల యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు యుగేందర్రావు, వెంకన్న, రాజశేఖర్, రామ్మూర్తి, రతన్రావు పాల్గొన్నారు.