– ఎంజీయూలో ఆకట్టుకున్న అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సదస్సు
రామగిరి, ఆగస్టు 04 : సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని రాష్ట్ర గవర్నర్, తెలంగాణ యూనివర్సిటీల చాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజభవన్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ ‘ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(ఏఎస్ఆర్) సమావేశం, నషా ముక్తే యువ వికసిత్ భారత్, మై భారత్ పోర్టల్, రెడ్ సోసైటీ తదితర అంశాల్లో విద్యార్థుల భాగస్వామ్యం, పేర్ల నమోదుపై నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యను సమీక్ష చేసి మాట్లాడారు. యూనివర్సిటీలు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు తమ సేవలను విస్తరించాలని సూచించారు. దేశంలో ఉన్న మానవ వనరుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుకోవాలంటే యువతకు విజ్ఞానంతో పాటు జీవన నైపుణ్యాలు, నైతిక విలువలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా ఎంజీయూ వీసీతోపాటు పలువురు వీసీలు మొదటి తరం విద్యార్థులలో ఆరోగ్య అవగాహన, హెచ్ఐబీ నివారణ, రక్తదానం, జీవన నైపుణ్యాల పెంపొందించడంలో రెడ్ రిబ్బన్ క్లబ్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయ ప్రస్తావించారు. దీనిలో భాగంగా సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక ఏఎస్ఆర్ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వం, పౌర సమాజంతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ రాజ్ భవన్ తో సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో వీసీలు నిర్ణయించారు.
రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలను వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వివరించారు. దీనిలో భాగంగా ఉన్నత విద్యా రంగానికి విశేష సేవలు అందిస్తున్న సీనియర్ వైస్ చాన్సలర్లలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్కు గవర్నర్ పుష్పాగుచ్చాలు అందచేసి ఘనంగా సన్మానించి అభినందించారు.