సుబేదారి, డిసెంబర్ 20 : సీఈఐఆర్.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. మీరు మీ సెల్ఫోన్ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందే వీలు కల్పిస్తూ భారత ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ను రూపొందించింది. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 10వరకు ఎనిమిది నెలల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 978 సెల్ఫోన్లు రికవరీ అయ్యాయి. మొత్తం ఆరు వేలకు పైగా ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు రాగా వినియోగంలో లేని 3,492 ఫోన్లను బ్లాక్ చేశారు. అలాగే 1,584 ఫోన్లను ట్రేస్ చేసి 984 అప్పగించగా, మిగతా 597 ఫోన్ల ఫిర్యాదులు దర్యాప్తు దశలో ఉన్నట్లు ఐటీ కోర్ విభాగం వెల్లడించింది.
ఫోన్ పోయినా/చోరీ అయినా వెంటనే మీసేవ సెంటర్కు వెళ్లి ‘సీఈఐఆర్’ పోర్టల్లో లేదా పోలీస్ ఐటీ కోర్ విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమయంలో ఫోన్ కొన్నట్టు ఉన్న రసీదు లేదా ఐఎంఈఐ నంబర్, ఆధార్కార్డు వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత మీసేవా రసీదును పోలీస్స్టేషన్లో అందస్తే ఫిర్యాదు వివరాల ఆధారంగా ఐటీ కోర్ విభాగం టెక్నాలజీ సాయంతో ఫోన్ ఎవరి వద్ద ట్రేస్ అవుట్ చేసి స్థానిక పోలీసులకు సమచారం అందజేస్తుంది. చోరీకి గురైన ఫోన్ వినియోగంలో లేకపోతే బ్లాక్ చేస్తారు. ఈ విధంగా ఐటీ కోర్ సహకారంతో పోలీసులు ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసి చోరీ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తారు.