నమస్తే తెలంగాణ నెటవర్క్, ఫిబ్రవరి 11 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పరకాల, భూపాలపల్లి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, ములుగులోని పలు వార్డుల్లో ఓటేసేందుకు పట్టణవాసులు పోటెత్తారు. పోలింగ్ ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేశారు. కొన్ని కేంద్రాల్లో ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. వృద్ధులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన యువత ఉత్సాహంగా కేంద్రాలకు తరలివచ్చారు.
ఉద్యోగ, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు రావడంతో వార్డుల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. 12 మున్సిపాలిటీల్లో 3,35,272 మంది ఓటర్లకు 2,63,283 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80.64 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వర్ధన్నపేటలో 86.23, అత్యల్పం గా భూపాలపల్లిలో 65.28 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా, జనగామలోని 5వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, భూపాలపల్లిలోని 30వ వార్డులో ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్ఘన్పూర్ 13వ వార్డు లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య, మహబూబాబాద్ 21వ వార్డు పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే శంకర్నాయ క్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, సామగ్రిని సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అక్కడ పటిష్ట పో లీస్ భద్రతను అధికారులు ఏర్పా టు చేశారు. కాగా, ఈనెల 13న ఓట్ల లెకింపు జరుగనుంది.
మహబూబాబాద్ 9వ వార్డులోని శనిగపురం పోలింగ్ బూత్లో నకిలీ ఓటు వేశారని, బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. కొంత సేపు వారి మధ్య ఘర్షణ జరగగా, పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జీవంతరావుపల్లి పోలింగ్ కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తి ఓటు వేసేందుకు రాగా గుర్తించిన బీజేపీ నాయకులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు గొడవను సద్దుమణిగింపజేశారు. ములుగు 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇంటిపై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ మద్యం సీసాలను పగులగొట్టినట్లు బాధితులు తెలిపారు. వర్ధన్నపేటలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను తండావాసులు అడ్డుకున్నారు. తండాలను మున్సిపాలిటీ నుంచి వేరు చేస్తామని చెప్పి తిరిగి ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఎందుకు వస్తున్నారంటూ నిలదీసేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టారు.

జనగామ, నర్సంపేట, స్టేషన్ఘన్పూర్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన నిర్వహణ, ఏర్పాట్లు లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వీల్ చైర్లు అందుబాటులో ఉంచకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులను సహాయకులు చేతులపై మోసుకెళ్లాల్సి వచ్చింది.
