హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. కుట్రలో భాగంగానే ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నది. ఆదివారం హైదరాబాద్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ది యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో ఐటీఐ, ఏటీసీలతో కలిసి డిప్లొమా కోర్సులను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం 2020 తీసుకొస్తే దానిని దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకించాయని చెప్పారు.
కానీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జాతీయ విద్యావిధానం అమలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిల్ యూనివర్సిటీ కౌన్సిల్లో ఏడుగురూ పారిశ్రామికవేత్తలే ఉన్నారని, వారే ప్రభుత్వ విద్యను అందులో ప్రత్యేకంగా పాలిటెక్నిక్ విద్యను వ్యాపారమయం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జీవో నంబర్ 97లోని విషయాలు విద్యార్థులకు బహిర్గతం చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.