ఖిలావరంగల్, జనవరి 26: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో 75వ భారత గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు. వరంగల్లో రూ. 80 కోట్ల వ్యయంతో జిల్లా సమీకృత కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతోందన్నారు. నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 93 కోట్లు, వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ. 39 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. చివరగా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రి కొండా సురేఖతోపాటు ప్రజాప్రతినిధులు తదితరులకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే, వరంగల్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన 224 మందిని ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతేకాకుండా ఖిలావరంగల్ ఖుష్మహల్ ప్రాంగణంలో కరీమాబాద్ ప్రభుత్వ స్కూల్, జడ్పీఎంఎస్ స్కూల్, గీసుగొండ కేజీబీవీ, చెన్నారావుపేట కేజీబీవీ, వంచనగిరి టీఎస్ఎంఎస్ విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాంగణంలో డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖ, మెప్మా, అటవీ, వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ ప్రావీణ్య వీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మాక్డ్రిల్ చేపట్టారు. కాగా, వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వరంగల్ సీపీ అంబర్ కిశోర్ఝా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వరుణ్రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, జిల్లా రెవెన్యూ అధికారి మహేందర్జీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నృత్యాలను వీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్ర, ఏవో శ్రీకాంత్, డీపీఆర్వో ఎండీ అయూబ్అలీ పాల్గొన్నారు.
వరంగల్ : ఉద్యమ ఆకాంక్షలు.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులు, భాతర రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ నగరంలో 2014 నుంచి ఇప్పటి వరకు 402 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధికి రూ.280 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంత్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, సీపీ అంబర్ కిశోర్ ఝా, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, రాధికాగుప్తా పాల్గొన్నారు.
వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్లో ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న 157 మంది ఉద్యోగులకు ప్రసంశా పత్రాలను అందజేశారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లోని టౌన్ హాల్పై జాతీయ జెండా ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ, సురేశ్జోషి, రామ తేజస్విని, ముస్కమల్ల అరుణ, ఆదనపు కమిషనర్లు అనీసుర్ రషీద్, రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.
హనుమకొండ సబర్బన్ : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటీ వరుణ్రెడ్డి విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. హనుమకొండలోని విద్యుత్ భవన్లో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 66లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం 44మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, గణపతి, సంధ్యారాణి, మోహన్రెడ్డి, తిరుపతిరెడ్డి, జనార్దన్, సీజీఎంలు సదర్లాల్, అశోక్కుమార్, మోహన్రావు, కిషన్, మధుసూదన్, రాజుచౌహన్, ప్రభాకర్, రవీంద్రనాథ్, అశోక్, భీకంసింగ్ పాల్గొన్నారు.
సుబేదారి : పోలీసు కమిషనరేట్లో సీపీ అంబర్ కిశోర్ ఝా జాతీయ జెండా ఆవిష్కరించారు. సేవా పథకాలకు ఎంపికైన పోలీసు అదికారులు, సిబ్బందికి పతకాలను అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు దాసరి మురళీధర్, అబ్దుల్ బారి, ట్రైనీ ఐపీఎస్ శుభం నగ్రాలె, అదనపు డీసీపీలు రాగ్యానాయక్, సంజీవ్ పాల్గొన్నారు. అలాగే, నక్కలగుట్టలోని జిల్లా సహకార కేంద్రబ్యాంకు కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్రావు జాతీయ ఆవిష్కరించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : , హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో గణత్రంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ జెండాలు ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పలు కూడళ్ల వద్ద ప్రజాప్రతినిధులు జెండా వందనం చేశారు. పరకాలలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి ఆర్టీసీ డిపోలో ఏడు నూతన బస్సులను ప్రారంభించారు. అలాగే, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జెండా ఎగురవేశారు. కాగా, వరంగల్ సిక్కులవాడ, రైల్వేస్టేషన్ ఆటో అడ్డాల వద్ద తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, 43వ డివిజన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, గ్రీన్వుడ్ పాఠశాల ఆవరణలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జెండాలను ఆవిష్కరించారు. రెండు జిల్లాల్లోని ప్రతి మండలంలో, గ్రామాల్లో గణతంత్ర వేడుకలు జరిగాయి.