ఖిలావరంగల్, డిసెంబర్ 12: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 58 దరఖాస్తులు వచ్చాయి. భూ సంబంధిత సమస్యలు 29 రాగా విద్యా, ఎంజీఎం, ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీవో, లింగిపోయిన మావోయిస్టు పునరావాస ప్యాకేజీ, మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి 29 దరఖాస్తులను కలెక్టర్ గోపి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన వినుతలపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు. అలాగే గత గ్రీవెన్స్ సెల్లో స్వీకరించిన దరఖాస్తుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ జోడో పోటీల్లో బంగారు, రజత పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. క్రీడలకు వరంగల్ జిల్లా అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ చెప్పారు. అలాగే ఈ నెల 16న జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చూపిన జిల్లాకు, రాష్ర్టానికి పేరు ప్రతిష్టలు తీసుకురవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్వని తానాజీ, ఆర్డీవో మహేందర్జీ, డీఆర్డీ పీఏ సంపత్రావు, జిల్లా క్రీడల అధికారి ఇందిర, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ కైలాస్యాదవ్తోపాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.