వరంగల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రావీణ్య ప్రకటించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, నవంబర్ 3న నోటిఫికేషన్ వెలువడుతుందని, ఆరోజు నుంచి నవంబర్ 10 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉప సంహరణ ఉంటుందని వివరించారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని నర్సంపేట, వరంగల్తూర్పు, వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సర్వీస్, ఎన్ఆర్ఐ ఓటర్లు సహా మొత్తం 7,34,044 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. అందులో పురుషులు 3,61,495, మహిళలు 3,72,191, ఇతరులు 358 ఉన్నట్లు ప్రకటించారు. మూడు నియోజకవర్గాల్లోని ఓటర్లలో 18-19 యువ ఓటర్లు 18,541 మంది ఉన్నారని తెలిపారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,724 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,28,887, మహిళలు 1,31,822, ఇతరులు 15 మంది అని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2,46,367 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,20,405, మహిళలు 1,25,624, ఇతరులు 338 మంది ఉన్నారని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో 2,26,953 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 1,12,203, మహిళలు 1,14,745, ఇతరులు ఐదుగురు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో సర్వీస్ ఓటర్లు 590 మంది ఉండగా నర్సంపేటలో 336, వరంగల్ తూర్పులో 85, వర్ధన్నపేటలో 169 ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ఆర్ఐ ఓటర్లు మూడు నియోజకవర్గాల్లో 43 మంది ఉంటే, వీరిలో నర్సంపేటలో 6, వరంగల్ తూర్పులో 22, 15 మంది ఉన్నట్లు చెప్పారు.
మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు మొత్తం 791 ఉండగా వీటిలో నర్సంపేటలో 283, వరంగల్ తూర్పులో 230, వర్ధన్నపేటలో 278 ఉన్నాయని తెలిపారు. పీడబ్ల్యూడీ వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నర్సంపేటకు స్థానిక ఆర్డీవో కే కృష్ణవేణి, వరంగల్ తూర్పునకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్, వర్ధన్నపేటకు అదనపు కలెక్టర్(లోకల్ బాడీ), సహాయ రిటర్నింగ్ అధికారులుగా నర్సంపేటలో కే విశ్వప్రసాద్, పీ కిరణ్కుమార్, పీఎస్ ఫణికుమార్, ఎల్ రవిచందర్రెడ్డి, వీ రాజ్కుమార్, బీ రాజేశ్, వరంగల్తూర్పులో ఎండీ ఇక్బాల్, రషీద్, బీ నాగేశ్వర్రావు, వర్ధన్నపేటలో వీ విజయసాగర్, వెంకటస్వామి, సీహెచ్ ప్రసాద్, కే విక్రమ్కుమార్ వ్యవహరిస్తారని తెలిపారు. అభ్యర్థులు ముందుగా ప్రకటనలు ఇస్తే ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని చెప్పారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం టోల్ఫ్రీ నంబర్ 1950 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ నంబర్ 0870 2530811, వాట్సాప్ నంబర్ 9154252936 ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. 24, 48, 72 గంటల్లో పాఠశాలలు, విద్యాసంస్థలపై ప్రైవేటు ప్రాపర్టీస్ అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్ల్లో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, పెయింటింగ్ తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలు, మోసాలు జరగకుండా సీ-విజిల్ మొబైల్ యాప్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్రీ యాప్ అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడొచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఏవైనా ఉల్లంఘనలు జరుగుతున్నా, అవకతవకలు జరిగినా సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎన్నికల సంఘం 100 నిమిషాల్లోగా స్పందిస్తుందని చెప్పారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడటం, అభ్యర్థుల దుష్ప్రవర్తన, ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం వంటి వాటిని పౌరులు గుర్తించినట్లయితే వెంటనే సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అప్పటికప్పుడే తప్పునకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని, ఎలాంటి గుర్తింపు లేకుండా అనామక వ్యక్తిగా కూడా ఈ యాప్లోకి లాగిన్ కావచ్చని కలెక్టర్ తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీల అనుమతుల కోసం సువిధ యాప్ పనిచేయనుందని తెలిపారు.
జిల్లాలో టీంలు పనిచేస్తాయన్నారు. నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మూడేసి ఫ్లైయింగ్ స్కాడ్లు, మూడేసి స్టాటిక్ సర్వేల్లియన్స్ టీమ్లు పనిచేస్తాయని, మూడు షిఫ్టుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10, రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల చొప్పున ఈ స్కాడ్లు, టీమ్లు విధులు నిర్వర్తిస్తాయని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. వీడియో సర్వేల్లియన్స్ టీములు నర్సంపేట, వరంగల్ తూర్పులో రెండేసి, వర్ధన్నపేటలో 4 షిప్టు పద్దతిన పనిచేస్తాయని, వీడియో వీవింగ్, అకౌంటింగ్ టీములు నియోజకవర్గానికి ఒకటి చొప్పున పనిచేస్తాయని, ప్రతి నియోజకవర్గానికి ఒక అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ ఉంటారని ప్రావీణ్య వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేశామని, జిల్లా ఎన్నికల అధికారి చైర్పర్సన్గా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) పనిచేయనుందని, ఈ కమిటీకి డీపీఆర్వో ఎండీ ఆయూబ్అలీ కార్యదర్శిగా వ్యవహరిస్తారని చెప్పారు. ఎన్ కృష్ణారెడ్డి, ఏ రాజ్కుమార్, శ్రీదర్, మెండు రవీందర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. డీపీఆర్వో ఆయూబ్ అలీ జిల్లా నోడల్ అధికారిగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ పనిచేస్తుందని, ఈ కమిటీలో సభ్యులుగా కలెక్టరేట్ ఈడిస్ట్రిక్ట్ మేనేజర్, జీఎం డీఐసీ, జిల్లా పంచాయతీ అధికారి, ఐటీ వింగ్ పోలీస్ ఉంటారని ప్రకటించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, వరంగల్ ఆర్డీవో వాసుచంద్ర పాల్గొన్నారు.