ఏండ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అడవిని ఆధారంగా చేసుకొని పోడు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసింది. గిరిజనుల దశాబ్దాలనాటి కలను నెరవేర్చి అటవీ శాఖ వేధింపులకు పుల్స్టాప్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,210 మంది రైతులు లబ్ధి పొందారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 33 గ్రామ పంచాయతీల పరిధిలో 51 హాబిటేషన్లలో 817 మంది రైతులకు 2,756 ఎకరాలకు పోడు పట్టాలు అందాయి. మంథని, భూపాలపల్లి నియోజకవర్గాల మధ్య పోడు భూములు సగానికి పైగా మంథని నియోజకవర్గంలో ఉండడంతో రెవెన్యూ పరంగా పట్టాలకు నోచుకోలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. అటవీ శాఖ వేదింపులు తప్పడంతో గిరిజనులు స్వేచ్ఛగా సాగు చేసుకుంటూ రైతుబంధును సైతం అందుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : దశాబ్ధాల నాటి కల సాకారమైన వేళ.. గిరిజనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్న తరుణం.. బతుకుదెరువు కోసం ఏళ్ల నాటి నుంచి పోడు భూముల్లో సేద్యం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనులకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. నేనున్నానంటూ ధీమా ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల వేధింపులకు ఫుల్స్టాప్ పెట్టారు. పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి బతుకుదెరువు భద్రత ఇవ్వగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3,210మంది రైతులు లబ్ధి పొందారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 817 మంది రైతులకు పట్టాలు అందాయి. జిల్లాలో మొత్తం పోడు భూముల పట్టా కోసం 70,921 ఎకరాలకు 25,394 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,210 మంది రైతులకు 7892.91 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. వీరిలో 2,477 ఎకరాలకు 7,582 మంది ఎస్టీలు దరఖాస్తు చేసుకోగా, 46,444 ఎకరాలకు 17,812 మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా మహాముత్తారం మండలం నుంచి 3,021 మంది ఎస్టీలు పోడు పట్టాలకు దరఖాస్తు చేసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 7892.91 ఎకరాలకు ప్రభుత్వం పోడు పట్టాలు అందజేసింది. జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, గణపురం, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల, రేగొండ, టేకుమట్ల మండలాల్లోని 92 గ్రామ పంచాయతీల్లో 164 హాబిటేషన్లలో 3,210 మంది రైతులకు 7892.91 ఎకరాలకు పోడు పట్టాలు అందజేశారు. భూపాలపల్లి మండలంలో 647 మంది రైతులు 1345.4 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. అలాగే చిట్యాల మండలంలో 140 మందికి 287.76 ఎకరాలకు, గణపురం మండలంలో 13 మంది రైతులకు 26.75 ఎకరాలకు, కాటారం మండలంలో నలుగురికి 6.85 ఎకరాలకు, మహదేవపూర్ మండలంలో 290 మందికి 564.12 ఎకరాలకు, మహాముత్తారం మండలంలో 1,528 మందికి రైతులకు 4,173.39 ఎకరాలకు, మల్హర్ మండలంలో 209 మంది రైతులకు 396.41 ఎకరాలకు, పలిమెల మండలంలో 362 మంది రైతులకు 1058.31, రేగొండ మండలంలో 17 మంది రైతులకు 33.92 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. పోడు పట్టాలకు ఎస్టీల నుంచి 7,582 దరఖాస్తులు రాగా గిరిజనేతరుల నుంచి 17,812 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు మోఖాపై విచారణ జరిపి పోడు పట్టాలు అందించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 33 గ్రామ పంచాయతీ పరిధిలో 51 హాబిటేషన్లలో 817 మంది రైతులకు 2,756 ఎకరాలకు పోడు పట్టా అందించారు. భూపాలపల్లి మండలంలో 647 మందికి 1345.4 ఎకరాలకు, చిట్యాల మండలంలో 140 మందికి 287.76 ఎకరాలకు, గణపురం మండలంలో 13 మందికి 26.75 ఎకరాలకు, రేగొండ మండలంలో 17 మందికి 33.92 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. భూపాలపల్లి మండలంలో 1,256 మంది ఎస్టీలు, చిట్యాల మండలంలో 302 మంది, గణపురం మండలంలో 28 మంది, రేగొండ మండలంలో 172 మంది, టేకుమట్ల మండలంలో ఆరుగురు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే భూపాలపల్లి మండలంలో 3761, చిట్యాల మండలంలో 705, గణపురం మండలంలో 224, రేగొండ మండలంలో 1052, టేకుమట్ల మండలంలో 337 మంది గిరిజనేతరులు పోడు పట్టాల దరఖాస్తు చేసుకున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో సరిహద్దు భూ వివాదానికి తెరపడింది. కొన్నేళ్లుగా భూపాలపల్లి సరిహద్దులో రెండు జిల్లాల మధ్య పోడు చేసుకున్న గిరిజనులు, గిరిజనేతరులు సరిహద్దు సమస్యతో సతమతమయ్యారు. మంథని, భూపాలపల్లి నియోజకవర్గాల మధ్య పోడు భూములు సగానికి పైగా మంథని నియోజకవర్గంలో ఉండడంతో రెవెన్యూ పరంగా పట్టాలకు నోచుకోలేదు. ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే గండ్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. అలాగే పోడు చేసుకుంటున్న గిరిజనేతరులు అటవీ శాఖ అధికారుల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పోడు పట్టాలు ఇవ్వడంతో వేధింపుల నుంచి విముక్తి పొందారు. స్వేచ్ఛగా సాగు చేసుకుంటూ రైతుబంధును సైతం తీసుకుంటున్నారు.
కేసీఆర్ సారు మా భూములకు పట్టాలిచ్చిండు. దీంతో ఫారెస్టోళ్ల బాధలు తప్పినయ్. 20ఏండ్లుగా లెంకలగడ్డలో 2.20 ఎకరాల ఫారెస్టు భూమిలో పంటలు పండించుకుంటానం. అది తప్ప మాకు ఏ దిక్కు లేదు. నాకు ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నడు. ఒక బిడ్డ పెండ్లి చేసిన. పోడు భూమిలో 20ఏండ్లుగా పత్తి సాగు చేసుకుని సాదుకుంటాన. మాటిమాటికి ఫారెస్టోళ్లు వచ్చి గొడవలు చేసేటోళ్లు. ఆఫీసుకు తీసుకపోయేటోళ్లు. కేసీఆర్ సారు అచ్చినంక భూములకు పట్టాలిచ్చిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు కూడా పడతానయ్. కేసీఆర్ సారు మేలు మరిచిపోం.