తెలంగాణ పల్లెలు ఇప్పుడు కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదు.. లూజు వైర్లు లేవు.. గాలిదుమారమొస్తే రోజుల తరబడి గాఢ అంధకారానికి అవకాశమే లేదు.. సమస్య వస్తే క్షణాల్లో పరిష్కారం.. ఎక్కడికక్కడ దృఢమైన విద్యుత్ లైన్లు, అవసరమైన చోట కొత్త సబ్స్టేసన్లు, ట్రాన్ఫార్మర్ల ఏర్పాటుతో జిల్లాలో నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తెలంగాణ వస్తే అంధకారం రాజ్యమేలుతుందన్నోళ్ల చెంప చెల్లుమనిపించేలా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యుత్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జిల్లాలో కొత్తగా 14 సబ్స్టేషన్ల నిర్మాణం, 12,399 విద్యుత్ స్తంభాలు, 290 కిలోమీటర్ల మేర నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ అందడంతోపాటు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
నర్సింహులపేట, జనవరి 2: ఒకప్పుడు తెలంగాణ పల్లెలో గాఢ అంధకారం.. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరంటు స్వయం ఉపాధి రంగాలను పూర్తిగా దెబ్బతీసింది. విద్యుత్ ఆధారిత వ్యాపారాలు పెట్టుకున్న చిరువ్యాపారులకు నష్టాలను మిగిల్చింది. విద్యుత్ రంగంపై నాటి పాలకులు దృష్టి పెట్టకపోవడంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. క్రాప్ హాలీ డేలతో పసిడి పంటలు పండే భూములు బంజరు భూములుగా మారగా, పవర్ హాలీ డేలతో పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక పల్లెల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. గాలి దూమారమొస్తే చెట్లు కూలి, స్తంభాలు విరిగి, వైర్లు తెగి ఊర్లకు ఊర్లు గాఢ అంధకారంలో మగ్గేవి. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ పునరుద్ధరణకు రోజుల తరబడి పట్టేది. ఇక మారుమూల తండాలు పరిస్థితి మరి దయనీయమంగా ఉండేది. కానీ, స్వరాష్ట్రంలో సీన్ మొత్తం మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలతో వెలుగులు విరజిమ్మే తెలంగాణగా, కనురెప్ప వాల్చినంత సమయం కూడా కరంటు పోని తెలంగాణగా ఆవిష్కృతమైంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అయ్యే ఎల్టీ లైన్లులో లూజువైర్లు లేకుండా చర్యలు చేపట్టారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అవసరమైన చోట కొత్తగా 33/11కేవీ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు.
జిల్లాలో ప్రభుత్వం కొత్తగా రూ.30 కోట్లతో డోర్నకల్, నెల్లికుదురులో 132/33 కేవీ సబ్ స్టేషన్లను నిర్మించింది. వీటికి అనుసంధానంగా బొమ్మకల్, పడమటిగూడెం, మడిపల్లి, నారాయణపురం, ఉల్లేపల్లి, సీరోలు, చర్లపాలెం, చెట్లముప్పారం, వేములపల్లి, ముంగిమడుగు గ్రామాల్లో పది 33/11 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కోదానికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు చేసింది. 2022లో బయ్యారం మండలం కంబాలపల్లి, గూడూరు దామరవంచలో 33/11 కేవీ సబ్స్టేషన్లు, సుమారు రూ.10కోట్లతో 180 కిలోమీటర్ల 33కేవీ కెపాసిటీ కలిగిన 30 లైన్లు, రూ.3.20కోట్లతో 11 కేవీ విద్యుత్ వైర్లు 110 కిలోమీటర్లు వేశారు. పెద్దనాగారంలోని 132/33 సబ్ స్టేషన్లో 50 ఎంబీ కెపాసిటీ కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వీటికి తోడు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు 15 ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.8.20కోట్లు ఖర్చు చేశారు. ఇక విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య ఎదురైతే ఒకటి, రెండు గంటల్లోనే అధికారులు పరిష్కరించి పునరుద్ధరిస్తున్నారు. వేలాడుతున్న తీగలను సరి చేయడం, శిథిలావస్థకు చేరిన స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చడం, అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారు. ఒక్కో సబ్స్టేషన్కు రెండు వైపుల నుంచి 132/33 కేవీ కెపాసిటీ కలిగిన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది.
7399 కొత్త విద్యుత్ స్తంభాలు..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో7,399 కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇం దులో భాగంగా 926 ఇనుప స్తంభాలకు బదులు సిమెంట్ స్తంభాలు, వేలాడుతున్న తీగలను సరిచేయడానికి 3,260 స్తంభాలు, లూజు వైర్లు ఉన్న చోట 2,037 వేసినట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు 2022లో మరో 5వేల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. పొ లాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్ర మాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లపై నుంచి వేళ్లే విద్యుత్ తీగలను సైతం మారుస్తున్నట్లు అధికారులు చెప్పారు.
కరంటు సరఫరాలో ఇబ్బందులు లేవు
ఒకప్పుడు ఎండాకా లం వచ్చిందంటే కరం ట్ సమస్య. ఎప్పుడు వ స్తుందో.. ఎప్పుడు పో తుందో తెలియదు. వానకాలంలో చిన్నపాటి చినుకులకే విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. కరంట్పోతే ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. దోమకాటు విష జ్వరాల బారిన పడేటోళ్లం. వైద్యం కోసం వేలకువేలు ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ బాధలు లేవు. చిన్న సమస్య వచ్చినా కరంటోళ్లు వెంటనే వచ్చి సరి చేస్తున్నారు.
– కుల్లా యాకయ్య, కొమ్ములవంచ
లూజు లైన్ల బాధ తప్పింది..
మా వ్యవసాయ బావి దగ్గర చేతికందే ఎత్తులో కరంటు వైర్లు ఉండేవి. గ తంలో ఎన్ని సార్లు చెప్పి నా అధికారులు పట్టించుకునే వారు కాదు. బావి వద్దకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిపడ్డాం. కేసీఆర్ పుణ్యమాని ఇప్పుడు ఆ సమస్యలు లేవు. కరంటోళ్లకు చెప్పన వెంటనే ట్రాన్స్ఫార్మర్ నుంచి మా బావి వరకు 10స్తంభాలు వేసి వేలాడుతున్న తీగలను సరి చేశారు.
– బానోత్ వీరన్న, భీమ్లాతండా