స్టేషన్ ఘన్పూర్, జూలై 23 : ఆర్టీసీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన స్టేషన్ ఘన్పూర్ బస్టాండు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలాలిలా ఉన్నాయి. వరంగల్ – 1 డిపోకు చెందిన ఏపీ28జడ్ 5403 నంబరు గల సూపర్ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్కు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరింది. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులున్నారు. 3.45కి స్టేషన్ ఘన్పూర్ సమీపంలో ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంది. బస్సు స్పీడ్ తగ్గడంతో డ్రైవర్కు అనుమానం వచ్చింది. అప్పటికే బస్సు వెనుకవైపు గల ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్తో పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు పొగ వాసన రావడంతో డ్రైవర్కు తెలియజేశారు. డ్రైవర్ వెంకటేశ్వర్లు బస్టాండు సమీపంలో జాతీయ రహదారిపై బస్సు పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దించారు. అప్పటికే బస్సులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కాగా, ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ను తెప్పించి సిబ్బందితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రమేశ్ నాయక్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని జనగామ ఫైర్ స్టేషన్కు తెలియజేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పాలకుర్తి, జనగామ నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. బస్సు దగ్ధమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఆర్టీసీ డీవీఎం శ్రీదేవి, హన్మకొండ, వరంగల్ -1 డిపో మేనేజర్లు మోహన్దాస్, భానుకిరణ్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బస్సు ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని, డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులను రక్షించాడని, ఈ సంఘటపై విచారణ చేపడుతామని డీవీఎం శ్రీదేవి తెలిపారు.