వర్ధన్నపేట, మార్చి 28 : వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హసన్పర్తి, హనుమకొండ రూరల్ మండలాల్లో ప్రగతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.9 కోట్లతో ఐనవోలు మల్లికార్జున స్వామి, రూ.6.99 కోట్లతో మడికొండ మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయాల్లో భక్తుల కోసం మెరుగైన వసతులను కల్పించింది. ఆకేరు వాగుపై వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలతో పాటు కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల సమీపంలో చెక్డ్యామ్లు, బ్రిడ్జిలు నిర్మించగా, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. మడికొండ టెక్స్టైల్ పార్కులో రూ.4.59 కోట్లతో మౌలిక వసతులు సమకూర్చింది. 187 చెరువులను మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పునరుద్ధరించి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ చొరవతో కళ్ల ముందు అభివృద్ధి ఫలాలు కనిపిస్తుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ ప్రగతి పనులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించింది. ఇందుకోసం కోట్ల రూపాయలను కేటాయిస్తున్నది. వరంగల్ గ్రేటర్లో విలీనమైన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్నది.
నీటి నిల్వకు చెక్డ్యామ్లు..
ఆకేరు వాగులో ఏడాదంతా నీరు నిలిచి ఉండేందుకు కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల సమీపంలో చెక్డ్యామ్లతో పాటు బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రభుత్వం 2020లో రూ.23 కోట్లు మంజూరు చేసింది. రెండింటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.3.10 కోట్లతో ఇల్లంద వద్ద, రూ.5.11 కోట్లతో ఐనవోలు మండలం నందనం వద్ద, రూ.2.99కోట్లతో పర్వతగిరి మండలం బొందివాగుపై, రూ.6 కోట్లతో హసన్పర్తి మండలం సూదనపల్లి వద్ద వాగుపై వంతెన, చెక్డ్యామ్లను నిర్మించింది. పాత చెక్డ్యామ్లకు మరమ్మతులు చేయించింది.
సరికొత్తగా వర్ధన్నపేట..
వర్ధన్నపేట జీపీని తెలంగాణ ప్రభుత్వం 2018లో మున్సిపాలిటీగా ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరిక మేరకు ప్రభుత్వం 2018 ఆగస్టు 2వ తేదీన మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా మరో రూ.10 కోట్లు కేటాయించగా, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా 50 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పట్టణంలో కొత్తగా అంతర్గత డ్రైనేజీని నిర్మించారు. అలాగే, కొత్త, పాత బస్టాండ్ల వద్ద రెండు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. రూ.2 కోట్లతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి, అంబేద్కర్ సెంటర్ నుంచి ఫిరంగిగడ్డ వరకు జఫర్గడ్ రహదారిపై డివైడర్లను నిర్మించి సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద రూ.2కోట్లతో అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.1.5 కోట్లతో మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు.
చూడచక్కగా రహదారులు..
రహదారుల నిర్మాణం, ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ.500.49 కోట్లను మంజూరు చేసింది. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడం, మట్టి రోడ్లు మాత్రమే ఉన్న అనేక గ్రామాలకు సైతం బీటీ రోడ్లు నిర్మించింది. కడిపికొండ నుంచి వరంగల్కు రోడ్డు వెడల్పు పనులతో పాటు రహదారి మరమ్మతుల కోసం రూ.29 కోట్లను మంజూరు చేసింది. ఘన్పూర్-వర్ధన్నపేట రోడ్డుకు రూ.4.10 కోట్లు, పర్వతగిరి-వడ్లకొండ రోడ్డుకు రూ.25కోట్లు, అన్నారం-వర్ధన్నపేట రోడ్డుకు రూ.12 కోట్లు, ఐనవోలు-పున్నేలు రోడ్డుకు రూ.90లక్షలు, కొండపర్తి-వెంకటాపూర్ రోడ్డుకు రూ.2.50కోట్లు, ఐనవోలు బైపాస్ రోడ్డుకు రూ.1.39కోట్లు, ఎనుమాముల-ఎల్బీకాలనీ రోడ్డుకు రూ.4 కోట్లు, గోపాలపురం-అనంతసాగర్ రోడ్డుకు రూ.21 కోట్లు కేటాయించింది.
వంతెనల కోసం రూ.105 కోట్లు..
నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల్లో బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.105.38 కోట్లను మంజూరు చేసింది. రూ.50కోట్లతో కడిపికొండ నుంచి వరంగల్కు వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసింది. అలాగే పర్వతగిరి మండలం కల్లెడ రోడ్డులోని ఆకేరు వాగుపై రూ.12.19కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి కమ్ చెక్డ్యాం నిర్మాణం చేపట్టింది. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి నుంచి జగన్తండా మధ్యలో రూ.1.50 కోట్లతో బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. ఇల్లంద-పర్వతగిరి రోడ్డులోని నల్లవాగుపై రూ.2.29 కోట్లు, హసన్పర్తి మండలం సూదన్పల్లి రోడ్డులో వాగుపై రూ.6 కోట్లతో వంతెనల నిర్మాణం పూర్తి చేసింది.
పేదలకు ‘డబుల్’ ఇండ్లు..
నియోజకవర్గానికి ప్రభుత్వం 1,400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. ఇందుకోసం రూ.77 కోట్లను కేటాయించింది. ఇందులో 1,080 ఇండ్లను ఇప్పటికే పేదలకు పంపిణీ చేశారు. మరో 320 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. గృహ నిర్మాణ పథకం ద్వారా ఎస్ఆర్నగర్, ఎనుమాముల వద్ద 208 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నది. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా రూ.5.51 కోట్లతో సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద రూ.23 కోట్లతో హాస్టల్ భవనాలను నిర్మించింది. ఐనవోలు, హసన్పర్తి మండల కేంద్రాల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల భవనాల నిర్మాణం కోసం రూ.3.28 కోట్లను మంజూరు చేసింది. వీటితో పాటు కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు, ఇతర అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టడంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యం..
ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా తయారయ్యాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ట్రాక్టర్, మొక్కలకు నీరు పోసేందుకు వాటర్ ట్యాంకర్ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగే డంపింగ్ యార్డుల నిర్మాణంతో పాటు చెత్తను తరలించేందుకు ట్రై సైకిళ్లు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికను నిర్మించింది. హరితహారంలో మొక్కలను నాటేందుకు ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసింది. హరితహారం యజ్ఞంలా నిర్వహిస్తుండడంతో గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కనిపిస్తున్నాయి.
పర్వతగిరి, కోనారెడ్డి చెరువులకు రూ.37 కోట్లు..
పర్వతగిరి పెద్ద చెరువు రిజర్వాయర్, వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.37 కోట్లను మంజూరు చేసింది. పర్వతగిరి పెద్ద చెరువును రూ. 23 కోట్లతో మినీ రిజర్వాయర్గా మార్చారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. కోనారెడ్డి చెరువుకు ప్రభుత్వం రూ.14 కోట్లను మంజూరు చేసింది. సుమారు 4 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెరువు కట్ట కోతకు గురికాకుండా రాయితో తెట్టె కడుతున్నారు. అలాగే తూములను కూడా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తున్నారు. మండలంలోని నల్లబెల్లి చెరువు కట్టను రూ.2.45 కోట్లతో మరమ్మతులు చేయడంతో పాటు తూమును ఆధునీకరించారు. హసన్పర్తి పెద్దచెరువును మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభుత్వం రూ.3.11 కోట్లను మంజూరు చేయగా, పనులు జరుగుతున్నాయి. అలాగే ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్ కెనాల్, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 8 సంవత్సరాల్లో సుమారు రూ.156.80 కోట్లను ఖర్చు చేసింది.
ఐనవోలు, మెట్టుగుట్ట ఆలయాలకు మహర్దశ..
సుప్రసిద్ధ ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు చేసింది. నృత్య మండప ఆధునీకరణ, ప్రహరీ, నీటి వసతి, అతిథి గృహాల నిర్మాణంతో పాటు దేవాలయం చుట్టూ బీటీ రోడ్డు, ఆర్చీలు నిర్మించారు. అలాగే మెట్టుగుట్ట మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.6.99 కోట్లను మంజూరు చేసింది. ఎమ్మెల్యే అరూరి రమేశ్ గత నెలలో పనులను ప్రారంభించారు. పర్వతగిరిలోని పురాతన పర్వతాల శివాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో పునర్నిర్మించారు. వీటితో పాటు ఐనవోలు, వర్ధన్నపేట మండలాల పరిధిలోని మసీద్లు, ఖబరస్థాన్, ఈద్గాల అభివృద్ధికి రూ.1.64 కోట్ల నిధులను మంజూరు చేయగా, పనులు పురోగతిలో ఉన్నాయి.
మిషన్ కాకతీయతో చెరువులకు జీవం..
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులకు జీవం పోసింది. గత పాలకులు పట్టించుకోక పోవడంతో చెరువుల కట్టలు, తూములు జీర్ణావస్థకు చేరుకున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 187 చెరువులను మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం రూ.103.98 కోట్లు మంజూరు చేసింది. నాలుగు దశల్లో చేపట్టిన పనులతో నియోజకవర్గంలోని సుమారు 17,399 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. చెరువుల తూములను అధునాతన పద్ధతిలో మరమ్మతులు చేయించడంతో ప్రతి ఏటా రెండు పంటలు పండుతున్నాయి.