ఖమ్మం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి లభ్యత, వినియోగం, నీటి విడుదలపై రైతులకు ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కల్పించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ( Puvvada Ajay Kumar ) రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎల్నినో నేపథ్యంలో పంటల సాగుకు అవసరమైన నీటి లభ్యతపై స్పష్టత ఇవ్వడంతో పాటు, రైతులు ముందస్తుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకునేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ( Irrigation Plan) ను ప్రకటించాలని సూచించారు.
వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షపాతంలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. సాగర్, గోదావరి, మున్నేరు, వైరా, పాలేరు, కిన్నెరసాని తదితర జల వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ఆయకట్టు రైతులకు ముందస్తుగా సమాచారం అందించాలని కోరారు.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో ప్రస్తుతం ఎంత మేరకు నీటి నిల్వలు ఉన్నాయి, ఎప్పుడు నీటిని విడుదల చేస్తారు, ఏ ప్రాంతాలకు ఎంత మేరకు నీరు అందుబాటులో ఉంటుంది అనే వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారికంగా ప్రకటించాలని కోరారు. నీటి విడుదలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ను ప్రకటిస్తే రైతులు పంటల ఎంపిక, సాగు సమయం, నీటి వినియోగంపై సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.