తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ఎప్పటిలాగే సర్కారు కానుక అందించనుంది. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా మహిళలకు చీరెలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాల్లోని నేత కార్మికులు 10 రంగులు, 195 డిజైన్లతో ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన చీరెలను పంపిణీ చేయనుంది. అధికారుల సర్వే ప్రకారం జిల్లాలోని 12 మండలాల్లో 2,09,513 మంది మహిళలున్నట్లు వెల్లడైంది. ఇందులో తెల్లరేషన్ కార్డు కలిగిన వారు 1,78,086 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరందరికీ సద్దుల బతుకమ్మ వేడుకల కోసం సర్కారు సారె అందించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా 18 ఏళ్లు నిండిన యువతులకు సైతం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
జనగామ రూరల్, సెప్టెంబర్ 8: ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందిస్తున్నది. ప్రజ ల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా ఆడబిడ్డలు నిర్వహించే బతుకమ్మ పర్వదినాన ప్రతి మహిళ మోములో చిరునవ్వు వెల్లివిరిసేలా సారెను సిద్ధం చేస్తుంది. 10 రంగులు, 190 డిజైన్లతో మంచి నాణ్యతతో నేతన్నలతో తయారు చేసిన చీరెలను ఈనెల చివరి వారంలో జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వం నుంచి వచ్చిన చీరెలను వెంటనే వివిధ మండలాలకు కేటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,09,513 మంది మహిళలున్నట్లు అధికారుల సర్వేలో వెల్లడైంది. ఇందులో తెల్లరేషన్ కార్డు కలిగిన వారు 1,78,086 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరందరికీ సర్కారు సారె పంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ముందు నిర్వహించే సద్దుల బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ప్రత్యేకమైంది. ఊరు, వాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా మహిళలు, యువతులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారీ కూడా 18 ఏండ్లు నిండిన యువతులకు సైతం చీరెలను పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అందించే బతుకమ్మ చీరెల్లో ఇప్పటికే కొన్ని జిల్లాకు చేరగా గోదాముల్లో భద్రపర్చారు.
ఈసారి పట్టుచీరెల రూపంలో…
బతుకమ్మ చీరెల నాణ్యత, పంపిణీపై సర్కారు మహిళల నుంచి అధికారుల వరకు అభిప్రాయాలు సేకరించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత ఆకర్షణీయంగా రంగురంగుల డిజైన్లతో చీరెలు తయా రు చేయించింది. ఎలాంటి లోపాలు లేకుండా మరింత మన్నికతో కూడిన చీరెలను నేతన్నలతో నేయించారు. సరికొత్త రంగుల చీరెలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు బుట్టాలు, ఝరీతో చీరెలను తయారు చేశారు. వీటి ప్యాకింగ్ను కూడా సుందరంగా రూపొందించారు.
మండల కేంద్రాల్లో నిల్వ…
ఇప్పటికే జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరెలను వివిధ మండలాలకు పంపుతున్నారు. రావాల్సిన చీరెలను మండలాలకు అందించేందుకు అధికారులు స్థలాలను సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మ చీరెల నిల్వ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మండల కార్యాలయాల నుంచి ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా బతుకమ్మ చీరెలు..
బచ్చన్నపేట మండలానికి 17,221, చిల్పూర్ 15,915, దేవరుప్పుల 16,517, స్టేషన్ ఘన్పూర్ 20,157, జనగామ మండలం 16,092, జనగామ పట్టణం 16,613, కొడకండ్ల 12,327, లింగాల ఘనపురం 15,891, నర్మెట 9,203, పాలకుర్తి 23,722, రఘునాథపల్లి 22,129, తరిగొప్పుల 7,401, జఫర్గఢ్ మండలానికి 16,325 బతుకమ్మ చీరెలను కేటాయించారు.
జిల్లాకు 2.09 లక్షల బతుకమ్మ చీరెలు
ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. సిరిసిల్ల నుంచి వచ్చిన చీరెలను ఇప్పటికే పలు మండలాలకు తరలించారు. మిగిలిన మండలాలకు వారం రోజుల్లో చీరెలు అందుతాయి. ఈ నెల చివరి వారంలో గ్రామాల వారీగా బతుకమ్మ చీరెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. రెవెన్యూ, డీఆర్డీవో, సివిల్ సైప్లె అధికారుల సమన్వయంతో గ్రామాల్లో రేషన్ డీలర్ల ద్వారా చీరెల పంపిణీ చేపడుతాం. అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ కానుకగా చీరెలను అందిస్తాం.
-గూడూరు రాంరెడ్డి, డీఆర్డీవో, జనగామ