ఐసీఐడీ సంస్థకు నామినేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వారసత్వ సాగునీటి కట్టడాల జాబితాలో చోటు
ఆమోదం పొందితే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
ఉమ్మడి వరంగల్కు మరింత శోభ
బయ్యారం, జూలై 18:వందల ఏళ్ల చరిత్ర కలిగిన వారసత్వ సాగునీటి కట్టడాలకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించనుంది. తెలంగాణలో కాకతీయుల కాలం నాటి చెరువులు సుమారు 400 దాకా ఉండగా, అవి ఎన్నో ఏళ్లుగా సాగునీటిని అందిస్తూ, పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఈ క్రమంలో వాటి ఖ్యాతిని మరింత పెంచాలని సంకల్పించిన సర్కారు.. రాష్ట్రంలో చారిత్రక నేపథ్యం ఉండి, సాగునీరందిస్తున్న ఆరు చెరువులను ఎంపిక చేసి ఇరిగేషన్ శాఖ ద్వారా ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్(ఐసీఐడీ)కు ప్రతిపాదనలు పంపింది. ఇందులో మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు, ములుగు జిల్లాలోని రామప్ప చెరువుకు చోటు దక్కింది. 2018లో ఐసీఐడీ సంస్థ ఆదిలాబాద్ జిల్లాలోని సదర్మాట్ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్దచెరువుకు ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా గుర్తింపునిచ్చింది.
పెద్దచెరువు, రామప్పలకు ఘన చరిత్ర
ఉమ్మడి వరంగల్లోని బయ్యారం పెద్ద చెరువు, ములుగు జిల్లాలోని రామప్ప చెరువుకు చరిత్రాత్మక నేపథ్యం ఉంది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సోదరి మైలాంబ తన తల్లి బయ్యాలదేవి(బయ్యమాంబ) పేరుమీదుగా బయ్యారం పెద్దచెరువును 12వ శతాబ్దంలో నిర్మించారు. అప్పడి నుంచి సాగునీటి వనరుగా ఈ చెరువు ప్రసిద్ధి పొందింది. ఈ చెరువు గార్ల, బయ్యారం మండలాలకు సుమారు 10 నుంచి 12 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అలాగే రామప్ప చెరువును గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ 1213లో నిర్మించినట్లు దాని పక్కనే ఉన్న శివాలయంలోని శాసనం తెలుపుతోంది. రెండు గుట్టల మధ్యలో ఆనకట్ట నిర్మించడం వల్ల ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన వాటిలో లోతైన చెరువుగా నిలిచింది. ఇది అధికారికంగా 6వేల ఎకరాలకు, అన ధికారంగా 5 వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. అలాగే నాలుగు మండలాల గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తోంది. కేవలం వర్షం నీరే ఆధారమైన దీనికి రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఈ చెరువులోకి విడుదల చేస్తూ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చింది. ఇక్కడి నుంచి పాకాల, గణపురం చెరువులకు నీటిని తరలిస్తున్నారు.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రెండు చెరువులు ఇప్పటికీ సాగునీరందిస్తూ మనుగడలో ఉండడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో చోటు..బయ్యారం పెద్దచెరువు, రామప్ప చెరువులకు ప్రపంచ పర్యాటక గుర్తింపు లభిస్తే అవి అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తాయి. ఇప్పటికే సందర్శకులతో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఐసీఐడీ ఆమోదం తర్వాత మరింత అభివృద్ధి చెందడంతో పాటు విదేశీ పర్యాటకులు సందర్శించే అవకాశాలున్నాయి. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరింత పర్యాటక శోభ రానుంది.
ప్రతిపాదనలు పంపాం..
చారిత్రక నేపథ్యం ఉండి, ఇప్పటికీ సాగునీరు అందిస్తున్న బయ్యారం పెద్దచెరువును ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించాలని నీటి పారుదల శాఖ నుంచి ప్రతిపాదనలు పంపాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు చెరువులను ఎంపిక చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రామప్ప చెరువు, బయ్యారం పెద్ద చెరువుకు జాబితాలో చోటు దక్కింది. గుర్తింపు వస్తే ప్రపంచ పర్యాటక ప్రదేశాల సరసన చేరి, మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.