ములుగు, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం మేడారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ములుగు కలెక్టర్, ఎస్పీతో పాటు 20శాఖల అధికారులు జాతర నిర్వహణకు కష్టపడి పనిచేశారన్నారు. ఈ జాతరలో రవాణా శాఖ ద్వారా మేడారానికి 10వేల బస్సు ట్రిప్పులు నడిపించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బస్సుల సంఖ్య పెంచడం వల్ల కొన్ని సాంకేతిక కారణాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని మంత్రి తెలిపారు. చిన్న, చిన్న ఘటనలు మినహా జాతర మొత్తం విజయవంతమైనట్లు సీతక్క చెప్పారు. జాతరకు నాలుగు రోజుల్లోనే కోటీ 45లక్షల భక్తులు వన దేవతలను దర్శించుకున్నారని వివరించారు. వన ప్రవేశం పూర్తయినా భక్తుల రద్దీ కొనసాగుతున్నదని, రేపటి వరకు అన్ని శాఖల అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు.
జాతరలో 5,090 మంది తప్పిపోగా 5,062 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని, మరో 28 మంది సంబంధిత శాఖ అధికారుల వద్ద ఉన్నారని, కుటుంబ సభ్యులు వస్తే వారిని అప్పగిస్తామన్నారు. ఏమైనా లోపాలు ఉంటే తిరుగు వారం తర్వాత సమావేశం నిర్వహించి చర్యలు చేపడుతామన్నారు. జాతర పూర్తయిన 10రోజుల వరకు పారిశుధ్య పనులను కొనసాగిస్తామని చెప్పారు. గత సంవత్సరం వరదల కారణంగా మేడారంలో భారీ నష్టం జరిగిందని, పరిస్థితులను సరిదిద్ది జాతరను నిర్వహించామని చెప్పారు. కొద్ది రోజుల్లో పూజారులతో సమావేశం నిర్వహించి మేడారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడుతామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, మేడారం ఈవో రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.