హనుమకొండ, మార్చి 14 : కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అవినీతి పరులకు కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక రోజు జైలుకెళ్లడం ఖాయమన్నారు. దేశంలో అరాచక పాలన కొనసాగుతున్నదన్నారు. అత్యంత ప్రమాదకరమైన మతత్వ, అవినీతి పార్టీ బీజేపీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్కు పరిమితం చేయడమే ఉభయ కమ్యూనిస్టు పార్టీల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఎలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరింపులకు గురిచేయడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని సాంబశివరావు విమర్శించారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొమ్మిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని విమర్శించారు. బీజేపీకి లొంగితే పునీతులు.. ఎన్నికలు జరుగనున్న ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి సారించిన మోదీ సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సాంబశివరావు పేర్కొన్నారు.
రాజకీయ వేధింపులు మానుకోవాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బినామీల పాత్ర ఉందం టూ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఎమ్మెల్సీ కవితను రాజకీయంగా వేధిస్తున్నారని సాంబశివరరావు తెలిపారు. ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు మోదీకి లొంగిపోయి వుంటే లికర్ సాం ఉండేది కాదన్నారు. బీజేపీ పాలనలో దేశంలో సుమారు రూ.150 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. విజయ్మాల్యా, లలిత్ మోడీ నుంచి ఆదానీ వరకు లక్షల కోట్లు కొల్లగొట్టిన వారేనని విమర్శించారు. మోదీ, అమిత్షా పై కేసులున్నా సీబీఐ, ఈడీ పట్టించుకోదని, వీరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. యాంటీ కరెప్షన్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిట్లర్ వారసుడు నరేంద్రమోదీ ఆన్నారు. మోదీ చర్యలు, విధానాలే బీజేపీ పతనానికి కారణమవుతుందని సాంబశివరావు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే బీజెపీ కో హఠావో..దేశ్కో బచావో పేరుతో ఏప్రిల్ 14 నుంచి మే 18 వరకు, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంటింటికీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. జూన్ 1 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి జూలై మొదటి వారంలో హైదరాబాద్లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సాంబశివరావు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో బండి సంజయ్ని కూడా ఓడిస్తామని అన్నారు. మతతత్వ పార్టీ బీజేపీని ఓడించేందుకు ప్రజాస్వామ్య లౌకికవాదులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
25 నుంచి విభజన హామీలపై ప్రజాపోరు యాత్ర
విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీపీఐ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తకళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పా టు చేయాలన్నారు. వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం పోరాటం చేస్తామన్నారు. సింగరేణి ఆద్వర్యంలోనే మైనింగ్ నిర్వహించాలన్నారు. ఈ పాదయాత్రను 25న బయ్యారంలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు నేదునూరి జ్యోతి, జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, బి. విజయ సారథి, సీహెచ్ రాజారెడ్డి, రాజ్ కుమార్, తోట మల్లికార్జునరావు, నాయకులు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, మండ సదాలక్ష్మి పాల్గొన్నారు.