వరంగల్, మార్చి 7(నమస్తే తెలంగాణ)/తొర్రూరు, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆడబిడ్డలకు ఆర్థిక, ఆరోగ్య పరంగా భరోసానిచ్చేందుకు నేడు మంత్రి కేటీఆర్ వస్తున్నారు. వరంగల్ జిల్లా ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించడంతో పాటు ఇక్కడ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో నిర్వహించే మహిళా దినోత్సవ సంబురాల్లో రామన్న పాల్గొంటారు. మహిళాదినోత్సవ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు మొత్తం రూ.750 కోట్ల వడ్డీలేని రుణాలను, అభయహస్తం డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయనున్నారు. 500 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు సైతం అందించనుండగా ఈ మేరకు తొర్రూరులో ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఏనుగల్లులో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరిశీలించారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పదివేల మందితో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిమ ఫౌండేషన్ వారు గ్రామంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు శిబిరం నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 12.25 గంటలకు ఏనుగల్లుకు హెలిక్యాప్టర్లో చేరుకుంటారు. కార్యక్రమానికి మంత్రులు దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
సభ అనంతరం మంత్రి కేటీఆర్ ఇక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 2గంటలకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు రోడ్డుమార్గంలో బయల్దేరుతారు. మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచనల మేరకు ఏనుగల్లో సభ వేదిక, పార్కింగ్, హెలీప్యాడ్ పనులు పూర్తయ్యా యి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీ నారాయణరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగంధర్రావు, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి ప్రతీక్, సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ కే మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్గౌడ్, జడ్పీటీసీ సింగులాల్, బీఆర్ఎస్ నేతలు భాస్కర్రావు, నర్సింగం, ఎం శోభన్, ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్క్రీనింగ్ కోసం ప్రతిమ ఆరోగ్యరథం మంగళవారం సాయంత్రమే ఏనుగల్కు చేరుకుంది. ఈ రథం ఓ మినీ హాస్పిటల్ అని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ చెప్పారు.
వైద్య శిబిరంలో లభించే సేవలు
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ ఆరెపల్లిలో దామెర క్రాస్రోడ్డు వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రతిమ ఫౌండేషన్ వారు నిర్ణయించారు. ఫౌండేషన్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు స్వగ్రామం ఏనుగల్ కాగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏనుగల్లో తొలి క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు.
మూడు రోజుల పాటు ఏనుగల్లో ప్రత్యేకించి మహిళల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో స్పెషాలిటీ సర్వీసెస్ మెడికల్ అంతాలజీ, సర్జికల్ అంతాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్టో ఎంటరాలజీ, జనరల్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీ, రేడియాలజీ, ఈఎన్టీ(చెవి, ముక్కు, గొంతు), డెంటల్ సంబంధిత పరీక్షలు చేస్తామని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్ట ర్ ప్రతీక్ వెల్లడించారు. ఎండోస్కోపీ, కల్పోస్కోపీ, పాప్న్మీయర్, న్యుమోగ్రఫీ, ఓరల్ క్యాన్సర్, రొమ్ము, గైనిక్ క్యాన్సర్ పరీక్ష, సీబీపీ, ఆర్బీఎస్, ఎక్స్రే వంటివి చేస్తారు. ఇక్కడ శిబిరం ముగిసిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా రెండు శిబిరాలను మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రతీక్ చెప్పారు. నోటిలో, గొంతులో ఏ పుండైనా, దీర్ఘకాలిక అల్సర్, కడుపునొప్పి, కామెర్లు, దమ్ము, దీర్ఘకాలిక దగ్గు, మూత్రం, మలంలో రక్తం పడడం, ఎర్రబట్ట, తెల్లబట్ట అధికంగా అవడం, చంక, మెడలో గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గొంతులో మార్పు, రొమ్ము, శరీరంలో కణుతులు, ఎక్కడైనా గడ్డలు, తరచూ అలసట, జ్వరం, నడుం నొప్పి, తలనొప్పి ఉన్న వారు ఏనుగల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. శిబిరంలో కన్సల్టేషన్, పరీక్షలు, వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయన్నారు.
మంత్రి ఎర్రబెల్లి పరిశీలన
సభ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సమీక్షించారు. ఆయాచోట్ల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని రాష్ట్రమంతా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తొర్రూరులో నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో మొత్తం రూ.750 కోట్ల నిధులను స్వయం సహాయక సంఘాల మహిళలకు కానుకగా అందిస్తున్నామన్నారు. ఇందులో రూ.250 కోట్లు పట్టణ ప్రాంతాల మహిళలకు, రూ.500 కోట్లు గ్రామీణ మహిళలకు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభయహస్తం నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తొర్రూరు గులాబీమయం
మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు మంత్రి దయాకర్రావు సూచనలతో బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, దయాకర్రావు, సత్యవతి రాథోడ్ చిత్రపటాలతో కూడిన కటౌట్లు, ఫ్లెక్సీలు, గులాబీ జెండాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 20వేల మంది మహిళలు తొర్రూరులో నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలకు తరలివస్తున్న తరుణంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మహిళల భాగస్వామ్యంతోనే భారీ ర్యాలీ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే అరూరి
ఏనుగల్లులో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్ మంగళవారం పరిశీలించారు. ఇక్కడ నిర్వహించే సభకు సుమారు 12వేల మంది హాజరవుతారని అంచనా వేశారు. హెలీప్యాడ్, సభా, పార్కింగ్ స్థలాలను చూసి పలు సూచనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే క్యాంప్ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏనుగల్లులో మహిళల కోసం స్క్రీనింగ్ క్యాంపును ప్రతిమ హాస్పిటల్ వారు ఏర్పాటు చేయడం గొప్పవిషయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ డైరెక్టర్ శాంతిరతన్రావు, మాజీ సర్పంచ్ తక్కళ్లపల్లి భాస్కర్రావు, మనోజ్కుమార్గౌడ్, దమ్మిశెట్టి నర్సింగం, గూడ నరేందర్ వర్మ ఉన్నారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
తొర్రూరు పట్టణంలో రూ.2కోట్ల13లక్షలతో నిర్మించిన యతిరాజారావు చిల్డ్రన్స్పార్, రూ.4కోట్లతో నిర్మించిన సమీకృత మారెట్ యార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.8కోట్ల75లక్షలతో నిర్మించే ఇండోర్ స్టేడియం, డివైడర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యతిరాజారావు పార్క్ ఆవరణలో రూ.5కోట్లతో ఇండోర్ స్టేడియం, ప్రస్తుతం ఉన్న గ్రోమోర్ కేంద్ర సమీపం నుంచి పాలకేంద్రం వరకు డివైడర్ కోసం రూ.2.75కోట్లు కేటాయించారు.
మహిళా దినోత్సవ కానుక
తొర్రూరులో మహిళా దినోత్సవ కానుకగా, రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి మంత్రి కేటీఆర్ చెకుల రూపంలో అందిస్తారు. అలాగే అభయహస్తం డబ్బులను పంపిణీ చేస్తారు. మహిళల స్వయంఉపాధి కోసం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో రూ.5 కోట్ల10లక్షలతో మొదటి విడుత కుట్టుశిక్షణలో శిక్షణ పొందుతున్న వారిలో 500మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తారు. అనంతరం 20వేల మంది మహిళలతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విడతలవారీగా పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మందికి కుట్టుశిక్షణ ఇప్పిస్తామని, అనంతరం ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
పర్యటన ఇలా..
తొర్రూరుకు మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 2.30గంటలకు యతిరాజారావు పార్క్ ఆవరణకు చేరుకుంటారు. పార్క్ను ప్రారంభించి ఓపెన్ జిమ్ను సందర్శించి అనంతరం హరిపిరాల క్రాస్రోడ్లో నిర్మించిన సమీకృత మార్కెట్ను ప్రారంభిస్తారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి అన్నారం క్రాస్ రోడ్ మీదుగా బైక్ ర్యాలీ, కోలాటం, వివిధ కళాప్రదర్శనలు, డప్పుచప్పుళ్లతో భారీ ప్రదర్శనగా అన్నారం రహదారిలోని ఆలయ భూముల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి 3.30గంటలకు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హెలీక్యాప్టర్లో హైదారాబాద్ వెళ్తారు.