Independence Day : లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎర్రకోట వద్ద శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరుకాలేదు. ఇద్దరూ ఈ వేడుకలకు హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఎర్రకోట వద్ద ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. 80వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగాయి. సాధారణంగా ఈ వేడుకలకు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నేతలు, ఇతర పార్టీల నాయకులు కూడా హాజరవుతారు. గతంలో ఖర్గే, రాహుల్ సహా అగ్రనేతలు హాజరయ్యే వారు.
కానీ, గత ఏడాది జరిగిన వేడుకలతోపాటు ఈరోజు జరిగిన వేడుకలకు కూడా ఇద్దరూ హాజరుకాకపోవడం ఆసక్తికరంగా మారింది. అధికారపక్షానికి, ప్రతిపక్షానికి మధ్య దూరం పెరిగింది అనేందుకు ఈ పరిణామం ఒక నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య వైరంగా మారిన సంగతి తెలిసిందే. మోదీపై, అమిత్ షాపై రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ ఎర్రకోట వద్ద వేడుకలకు చివరిగా 2024లో హాజరయ్యారు. అప్పట్లో రాహుల్కు కేటాయించిన సీటుపై వివాదం నడిచింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీట్లు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి వేడుకల్లో ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాలి. ఆ తర్వాత నుంచి వేడుకలకు ఆయన హాజరవ్వడం లేదు.
సాధారణంగా లోక్సభ ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. ప్రోటోకాల్ అనుసరించాలి. అయితే, రాహుల్కు సీటు కేటాయింపులో ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆయనను అవమానించడం అంటే, ప్రజల్ని అవమానించినట్లే అని వ్యాఖ్యానించింది. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం తమ పంతాలకు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయాల్ని కాలరాస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.