వరంగల్, సెప్టెంబర్ 24(నమస్తేతెలంగాణ) : ధాన్యం కొనలేమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం వరికి బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే జూన్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు జరిగేలా ముందుకు వెళ్తున్న ది. ఈ క్రమంలో ఉద్యానశాఖ అధికారులు, సిబ్బందికి తోడుగా వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు, సిబ్బందిని సైతం రంగంలోకి దింపే ఆలోచనలో ఉంది. వచ్చే జూన్ నుంచి నిర్దేశిత లక్ష్యానికి మించి విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు జరిగేందుకు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉద్యానశాఖ అధికారులకు ఈ మేర కు ప్రభుత్వం నుంచి ప్రాథమిక సమాచారం కూడా అందినట్లు తెలిసింది. ఉదాహరణకు జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనువైన విస్తీర్ణం సుమారు 57 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఏటా కొన్ని వేల ఎకరాల చొప్పున దశలవారీగా సాగు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తొలివిడుత వచ్చే ఏడాది జూన్లో జిల్లాలో 15 వేల ఎకరా ల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించి ప్రణాళిక రూ పొందించారు. తాజా పరిణామాల దృష్ట్యా అదనంగా మరో వంద శాతం విస్తీర్ణంలో అంటే దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఈమేరకు కార్యచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారులకు సూచించింది.
క్షేత్రస్థాయి ప్రదర్శన..
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది వేలకుపైగా ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగుకు ఉద్యానశాఖ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. ఆసక్తి చూపుతున్న రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఉద్యానశాఖ అధికారులను ఆదేశించిం ది. దీంతో ఉద్యానశాఖ అధికారులు ఇటీవల తొలివిడుత జిల్లా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను ఆర్టీసీ బస్సుల ద్వారా ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ప్రాంతంలోని ఆయిల్పామ్ తోటల వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయిల్పామ్ సాగుకు ముందుకొస్తున్న రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో మండల స్థాయిలో రైతులకు అవగాహన స దస్సులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సంగెం మండ ల కేంద్రంలో జరిగిన సదస్సులో ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు పాల్గొని ఆయిల్పామ్ సాగుపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సుల నిర్వహణే గాకుండా ఇక్కడి రైతులను ఆర్టీసీ బస్సుల ద్వారా ఆయిల్పామ్ తోటల వద్దకు తీసుకెళ్లి రైతులతో మాట్లాడించేలా ప్లాన్ చేశారు. కొద్దిరోజుల క్రితం పర్వతగిరి మండలం నుంచి సుమారు వంద మంది రైతులను, గురువారం వర్ధన్నపేట మండలం నుంచి పలు గ్రామా ల రైతులను ఖమ్మం జిల్లా కేంద్రం పరిసరాల్లోని ఆయిల్పామ్ తోటల వద్దకు తీసుకెళ్లి క్షేత్రస్థాయి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిన రైతులు ఖమ్మంలోని ఆయిల్పామ్ తోటలను స్వయంగా చూసి వాటి ని సాగు చేసిన రైతులతో మాట్లాడడం ద్వారా వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఆయిల్పామ్ సాగుపై తమకున్న సందేహాలను తీర్చుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఇలా రైతులను ఖమ్మంలోని ఆయిల్పామ్ తోటల వద్దకు తీసుకెళ్తామని, వాటిని సాగు చేసిన రైతులతో మాట్లాడిస్తామని ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు.
సౌత్అమెరికా నుంచి విత్తనాలు..
వచ్చే ఏడాది జూన్ నుంచి ఆయిల్పామ్ సాగు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లాలో ఆయిల్పామ్ చేసే రైతులకు మొక్కలు అందజేసేందుకు రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ కంపెనీ సంగెం మండలంలోని లోహిత గ్రామ శివారులో నర్సరీ ఏర్పాటు చేసింది. వచ్చే జూన్ నుంచి రైతులకు పంపిణీ చేసేందుకు ఈ నర్సరీలో మొక్కల పెంపకం చేపట్టింది. దశలవారీగా సౌత్అమెరికాలోని కోస్టారికా నుంచి ఆయిల్పామ్ విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నది. ఇటీవల వచ్చిన 1.04 లక్షల మొలకలతో లోహిత నర్సరీలో మొక్కలు పెంచుతున్నది. త్వరలో మరికొన్ని లక్షల ఆయిల్పామ్ విత్తనాలు సౌత్అమెరికా నుంచి ఈ నర్సరీకి చేరుకోనున్నాయి. ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు నర్సరీని సందర్శించి ఇందులో పెరుగుతున్న ఆయిల్పామ్ మొక్కలను పరిశీలించారు. వీటి పెంపకంపై నిర్వాహకులకు సూచనలు చేశారు.