నర్సంపేట రూరల్, డిసెంబర్ 7: తండ్రిని కోల్పోయిన నిరుపేద పిల్లలను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీవో) జీ మహేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. లక్నేపల్లిలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఇంటి యజమాని ఆత్మహత్య చేసుకోగా, ఆ కుటుంబాన్ని మంగళవారం జిల్లా, మండలస్థాయి అధికారులు పరామర్శించారు. గ్రామంలోని బుడిగెజంగాల కాలనీకి చెందిన పర్ధం హరీశ్-రాజేశ్వరి దంపతులకు 4 ఏళ్లు, 5 ఏళ్లు, 7 ఏళ్లు కలిగిన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబం పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 6న ‘పాపం.. పసివాళ్లు’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని డీసీపీవోతోపాటు నర్సంపేట ఐసీడీఎస్ సీడీపీవో రాధిక, అధికారులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య, పిల్లలకు 25 కిలోల బియ్యం, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ముగ్గురు ఆడపిల్లల చదువుకోసం, ప్రభుత్వ సహాయం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని మహేందర్రెడ్డి తెలిపారు. పిల్లల సంరక్షణ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏసీడీపీవో హేమలత, అంగన్వాడీ టీచర్ విజయ పాల్గొన్నారు.