పాఠశాలల్లో స్థితిగతులపై సమాచార సేకరణ
ఆన్లైన్లో వివరాల నమోదుకుగడువు నేడే ఆఖరు
కార్పొరేట్ను తలదన్నేలా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3438 బడులు
నెల్లికుదురు, మార్చి 29 : సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను కల్పించి వాటి రూపురేఖలు మార్చేందుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను ప్రభుత్వం బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించింది. పాఠశాలల్లో సౌకర్యాల వివరాలు సేకరించాలని ప్రభుత్వం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న అధికారులు డీఈవోలతో జూం మీటింగ్ను నిర్వహిం చగా, వారు ఈ నెల 28న ఎంఈవోలు, నోడల్ అధికారులు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ,సీఆర్పీలు, ఐఈఆర్పీలతో జూం మీటింగ్ నిర్వహించి సర్కారు బడుల నుంచి సమాచార సేకరణపై సమీక్ష నిర్వహించారు.
సేకరించాల్సిన వివరాలివీ..
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, తరగతి, కమ్యూనిటీలవారీగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు, ఎన్ని తరగతి గదులున్నాయి? ఇంకా ఎన్ని కావాలి?, శిథిలావస్థలో ఎన్ని ఉన్నాయి?, అదనపు గదులు అవసరమున్నాయా?, ఉంటే గదులు నిర్మించేందుకు ఎంత స్థలం అందుబాటులో ఉంది?, ఎన్ని మరుగుదొడ్లు అవసరమున్నాయి?, డ్యుయల్ డెస్కులు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్లు, విద్యుత్ సరఫరా, బ్లాక్ బోర్డు, తాగునీటి సౌకర్యం, ప్రహరీ, కే-యాన్, ప్రొజెక్టర్, ఆట స్థలం, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు తదితర వివరాలను సేకరించాలి.
సేకరించాల్సిన విధానం..
మండలంలోని సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ క్లస్టర్ పరిధిలో ఉన్న పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులతో నిర్దేశించిన నమూనాలో సమాచారం సేకరించాలి. ఆ వివరాలను మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఐఎస్ కో ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో www.schooledu. telangana.gov.in సైట్లో పాఠశాల యూజర్ ఐడీతో నమోదు చేయాలి. ఆ తర్వాత మరోసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. కాంప్లెక్స్ సీఆర్పీ, ఎమ్మార్సీ సిబ్బంది సహకారంతో పాఠశాల వివరాలను నమోదు చేయించే వరకు పూర్తి బాధ్యత ఆ పాఠశాల హెచ్ఎందే.
ఉమ్మడి జిలా ్లవారీగా పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్, యూఆర్ఎస్ కలిపి మొత్తం పాఠశాలలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్-922, వరంగల్ రూరల్-686, వరంగల్ అర్బన్-485, జయశంకర్ భూపాలపల్లి -448, ములుగు-367, జనగామ-530.
ఇవి కూడా చదవండి