సిబ్బంది కరోనా పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
హన్మకొండ సిటీ, మే 5: ద్విచక్రవాహనాలు వినియోగించే ప్రతి పోలీసు విధిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. ధర్మసాగర్ పోలీస్స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించి స్టేషన్ ఆవరణతో పాటు సిబ్బంది నివాస సముదాయాలను పరిశీలించారు. ఈ క్రమంలో సన్నిహిత కౌంటర్తో పా టు స్టేషన్ సిబ్బంది వివరాలు, అత్యధిక నమోదయ్యే కేసులతోపాటు వర్టికల్స్ పనితీరుపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పా టు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్టేషన్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఠాణాల అధికారులు సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయించడంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. సిబ్బంది వ్యక్తిగత సమస్యలతోపాటు శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బం ది నివాస సముదాయాలతోపాటు స్టేషన్ ఆవరణలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి హరితఠాణాలుగా తీర్చిదిద్దాలన్నారు. సీపీ వెంట సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప, కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ ఉన్నారు.