వరంగల్ చౌరస్తా : అర్ధరాత్రి మద్యం మత్తులో పూల వ్యాపారితో పాటు అడ్డుపడిన పలువురిపై దాడి చేసి గాయపరిచిన యువకులను ఇంతేజార్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎండీ దస్తగిరి సీకేఎం ఆసుపత్రి రోడ్లోని తన పూల షాపు ముందు నిద్రిస్తున్న సమయంలో అటుగా వెలుతున్న యాట విజయ్, సంజయ్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడటంతో బాధితుడి అరుపులు విన్న తోటి వ్యాపారులు, గుమస్తాలు నిందితులను అడ్డుకున్నారు. నిందితులు తమ మిత్రులకు ఫోన్లో సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వారు పూల వ్యాపారులు, గుమస్తాలపై దాడికి దిగారు. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో పూలవ్యాపారం చేసుకుంటున్న యూసఫ్, సలీంలు తీవ్రంగా గాయపడగా, వారితో పాటుగా మరో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు యాట విజయ్, సంజయ్, మోసిన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడిలో పాల్గొన్న మిగిలిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని సీఐ మల్లేష్ తెలిపారు. నిత్యం వందలమంది మహిళలకు ప్రసూతి వైద్యసేవలు అందిస్తున్న సీకేఎం ఆసుపత్రికి కూతవేటు దూరంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో సైతం ఇదే తరహాలో వరంగల్ చౌరస్తాలో జరిగిన గొడవలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటనను స్థానికులు గుర్తు చేస్తూ ఇప్పటికైనా పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.