హనుమకొండ చౌరస్తా, నవంబర్ 19 : హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ఊయల నిరంతరం అందుబాటులో ఉంటుందని, పిల్లలు వద్దనుకొనేవారు ఊయలలో వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను చెత్తకుప్పులు, ముళ్లపొదల్లో వేయొద్దని చేతులెత్తి మొక్కుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడొద్దని, ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా తల్లిదండ్రులను వేడుకుంటున్నట్లు చెప్పారు. పిల్లను వద్దనుకుంటే ఊయలలో లేదా నేరుగా దత్తత విభాగం అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. బాలల హకుల వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్) ఆవరణలో ఊయల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వినయ్భాస్కర్ మాట్లాడుతూ వదిలేసిన, నిరాదరణకు గురైన పిల్లల సంరక్షణ కోసం ఊయల కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నిరాదరణకు గురైన పిల్లలను జిల్లా బాలల పరిరక్షణ విభాగం చేరదీస్తుందని తెలిపారు. ఊయల కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా జీఎంహెచ్లో ప్రారంభించినట్లు తర్వాత బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో ఊయల కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
చారిత్రక నగరంలో బాలబాలికలపై ఎలాంటి అమానవీయ సంఘటనలు జరుగకుండా ప్రతిఒకరూ కృషి చేయాలని వినయ్భాసర్ పిలుపునిచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అన్నమనేని అనిల్చందర్రావు మాట్లాడుతూ వదిలేసిన పిల్లలను చేరదీసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టగా సదరు సమాచారం గురించి పత్రికలో ప్రకటన ఇచ్చి, గడువు తీరిన తదుపరి ‘లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్’ చేసి వారిని చట్టబద్ధంగా దత్తత ఇస్తున్నామని చెప్పారు. వీటిలో అమెరికా, మాల్టా దేశాలకు ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఇచ్చామని అన్నారు. ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ 2007 నుంచి అక్టోబర్ వరకు దత్తత వనరుల కేంద్రం నిబంధనల మేరకు వదిలేసిన 179 మంది పిల్లలను దత్తత ఇచ్చామని చెప్పారు. వదిలేసిన పిల్లల గురించి 100, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. బీఆర్బీ కోఆర్డినేటర్ కే శిరీష మాట్లాడుతూ బాలల రక్షణ ధ్యేయంగా లైన్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో పని చేస్తున్నామని, భవిష్యత్ ప్రణాళికతో మరిన్ని సేవలు అందేలా కృషి చేస్తామని అన్నారు.
సంఘ సేవకురాలు కే అనితా రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు బాలల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, బాలల స్నేహపూర్వక జిల్లాగా మార్చాలని ఆకాంక్షించారు. అనంతరం ఊయల అందించిన శేషగిరిరావును, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మేరుగు శ్రీనివాసులు, సంగి చైతన్య, నగేశ్ను వినయ్భాస్కర్ ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్ర ప్రసాద్, కార్పొరేటర్ భైరి లక్ష్మీకుమారి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యాకూబ్పాషా, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ఎంవో డాక్టర్ సారంగం, డెమో వేముల అశోక్ రెడ్డి, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్కుమార్, ఎం మౌనిక, ఎల్సీపీవో సతీశ్, శిశుగృహ మేనేజర్ దూడం నగేశ్, సోషల్ వరర్ శ్రీనివాసులు, సంగి చైతన్య, జీ సునీత, కౌన్సిలర్ ఏ మాధవి, విజయ్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు వంచ రాజ్యలక్ష్మి, కవిత, చైల్డ్లైన్ నోడల్ కో ఆర్డినేటర్ ఇక్బాల్పాషా, కోఆర్డినేటర్ రాగి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.