Uppal Stadium | ఉప్పల్, మే 2 (నమస్తే తెలంగాణ): కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట్ సమస్య తలెత్తింది. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి కరెంట్ సరఫరా లేక అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కార్పొరేట్ బాక్సుల్లో గంటకు పైగా కరెంట్ సరఫరా నిలిచి చీకట్లు అలుముకున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి కరెంట్పైకి మళ్లింది. ప్రపంచ దిగ్గజ క్రికెటర్ల ముందు విద్యుత్తు సమస్య తలెత్తడం సిగ్గుచేటని పలువురు చర్చించుకుంటున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొన్నామని, మ్యాచ్ వీక్షిద్దామని వస్తే కరెంట్ లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలే ఉష్ణోగ్రతలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో కరెంట్ పోవడం తమను మరింత బాధకు గురిచేసిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కరెంట్ ఎందుకు కట్ చేశారంటూ స్టేడియం యాజమాన్యంతో ఘర్షణకు దిగినట్టు తెలిసింది.
గతంలో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చైన్నె జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కొన్నినెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేసినట్టు ఆనాడు అధికారులు తెలిపారు. రూ.1.57 కోట్లు విద్యుత్తు బిల్లులు హెచ్సీఏ చెల్లించలేదని విద్యుత్ అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే.