హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు బస్సుయాత్ర శుక్రవారం నుంచి తిరిగి కొనసాగనున్నది. కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల విధించిన నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనున్నది. ఈ తర్వాత కేసీఆర్ తిరిగి జనంలోకి వెళ్లనున్నారు. రామగుండం నుంచి బస్సుయాత్ర పునఃప్రారంభం కానున్నది. గతనెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్షో అప్రతిహతంగా కొనసాగుతున్నది.
కేసీఆర్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలు నియామవళికి విరుద్ధమని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ 48 గంటలపాటు ఆయనపై నిషేధం విధించడంతో గురువారం జమ్మికుంటలో కేసీఆర్ నిర్వహించాల్సిన రోడ్షో రద్దు అయిన విషయం తెలిసిందే. ఈసీ విధించిన గడువు శుక్రవారం రాత్రి 8 గంటలతో ముగిసిన తర్వాత కేసీఆర్ రామగుండంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. రామగుండంలో మొదలై సిద్దిపేట బహిరంగ సభతో బస్సుయాత్ర ముగియనున్నది. ముందస్తు షెడ్యూల్లో ఒక్క జమ్మికుంట మినహా కేసీఆర్ ప్రచార పర్యటన అంతా యథాతథంగా సాగుతున్నది.
కేసీఆర్ బస్సు యాత్రతో సమీకరణాలు బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతున్నాయని, కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ జనసంద్రం పోటెత్తుతున్నదని గ్రహించిన కాంగ్రెస్, బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్ నియమాలను సాకుగా చూపి నిలువరించే ప్ర యత్నం చేశాయని బీఆర్ఎస్ భగ్గుమన్నది. తమ నిజస్వరూపాన్ని కేసీఆర్ బయటపెడుతున్నారనే అక్కసుతోనే ఆ పార్టీలు మిలాఖత్ అయి కేసీఆర్ను నిలువరించాలన్న కుట్రలు ప్రజల ముందు నిలపడవని చెప్తున్నది.
కేసీఆర్ కార్యాచరణను కేవలం 48 గంటలపాటు నిలిపివేసినంత మాత్రాన ప్రజానిరసన నుంచి వారు తప్పించుకోలేవని అంటున్నది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని,ఈసీ ఆదేశాల మేరకు కేసీఆర్ 48 గంటలు ప్రచారాన్ని నిలిపివేశారని పేర్కొన్నది. ఆ రెండూ ఒక్కటై బీఆర్ఎస్ను లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఆ పార్టీలకు తగిన బుద్ధిచెప్తాయని పార్టీ శ్రేణలు స్పష్టం చేశాయి.