దుగ్గొండి : వందశాతం కరోనా వ్యాక్సినేషన్ను పూర్తి చేసేలా చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ కలెక్టర్ గోపీ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని తొగరాయి, వెంకటాపురం, దుగ్గొండి మండల కేంద్రంలో కలెక్టర్ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. తొగరాయి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామానికి తొలిసారి వచ్చిన కలెక్టర్ గోపీనీ ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకటాపురంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించి గ్రామంలో నిర్మించ తలపెట్టిన మిషన్భగీరథ వాటర్ ట్యాంక్ను కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన స్థల దాత హింగే రామారావును కలెక్టర్ శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఓపీ రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేశారు. స్థానిక హోమియోపతి ఆసుపత్రి నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హోమియోపతి వైద్యురాలు గైర్హజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వసతులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలనా పాటించి గ్రామాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో ప్రకాశ్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచ్లు ఓడేటి తిరుపతిరెడ్డి, హింగోళి రాజేశ్వర్రావు, వైద్యాదికారి రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.