సుబేదారి, ఏప్రిల్ 9 : సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఆయన నివాసంలో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన 81 మంది లబ్ధిదారులకు శనివారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆడబిడ్డల పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలకు చీరలు పంపిణీతోపాటు షీ టీమ్స్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందిస్తున్నారని వివరించారు. రైతులకు రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి, రైతు చనిపోతే రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని వివరించారు. మన ఊరు-బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్కు ఒక విధంగా, తెలంగాణకు ఒక విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.