Atishi | అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై ఢిల్లీ మంత్రి అతిశీ (Atishi) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతి మలివాల్ ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్నారని ఆరోపించారు. ఈ మొత్తం కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. ఎంపీని హస్తం పార్టీ బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. స్వాతిపై ఢిల్లీ మహిళా కమిషన్లో అక్రమ రిక్రూట్మెంట్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కుమ్మక్కై ఇలా దాడి ఆరోపణలు చేస్తున్నారని అతిశీ మండిపడ్డారు. బీజేపీ సూచనల మేరకు ఆమె వ్యవహరిస్తోందన్నారు.
‘ఈనెల 13న అపాయింట్మెంట్ లేకుండానే ముఖ్యమంత్రి నివాసానికి స్వాతి మలివాల్ వెళ్లారు. ఆమె ఎందుకు లోపలికి దూసుకెళ్లారు..? అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి నివాసానికి ఎందుకు వచ్చారు..? అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు బిజీగా ఉన్నారు. ఆమెను కలవలేదు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగం. వారు ముందుగా కేసులు పెట్టి.. ఆ తర్వాత నేతలను జైలుకు పంపుతామని బెదిరిస్తుంటారు. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన అక్రమ రిక్రూట్మెంట్ కేసులో స్వాతి మలివాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆమెను అరెస్టు చేసే దశలో.. మలివాల్ను బీజేపీ బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఆమె దాడి ఆరోపణలు చేస్తోంది’ అని అతిశీ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అతిశీ ధ్వజమెత్తారు. స్వాతిపై బిభవ్ కుమార్ ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. దేశ రాజధానిలో లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తున్నారని అతిశీ ధ్వజమెత్తారు.
దాడి అంతా డ్రామానేనా..?
మరోవైపు దాడి ఆరోపణల నేపథ్యంలో కేజ్రీ నివాసంలో సెక్యూరిటీ సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగిన వీడియో శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే శనివారం మరో వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు కనిపించింది. ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆమె కూల్గానే ఉన్నారు. ఎక్కడా దెబ్బలు తగిలినట్లు కనిపించడం లేదు. చాలా మామూలుగానే నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో ఆమె మాట్లాడారు. ఈ వీడియోని ఆప్ శనివారం ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతోపాటు కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు స్వాతి వెళ్తున్న వీడియోని కూడా ఆప్ పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె మెట్లు దిగుతూ కుంటుతూ కనిపించింది. ‘స్వాతి మలివాల్ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని ఈ వీడియో బట్టబయలు చేస్తుంది’ అంటూ వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఇంతకీ ఏం జరిగిందంటే..
సోమవారం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు. ‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు బిభవ్ కుమార్ నాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఏడెనిమిది సార్లు బలంగా కొట్టాడు. నన్ను లాగేయడంతో టేబుల్కు నా తల తగిలి కింద పడిపోయాను. కావాలని నా చొక్కా పైకి లాగాడు. నా చొక్కా గుండీలు ఊడిపోయాయి. నా కడుపు, పొత్తి కడుపు, ఛాతిపై తన్నాడు. నేను పీరియడ్లో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడి చేశాడు.’ అని స్వాతి ఫిర్యాదు చేశారు. మరోవైపు, సీఎం నివాసంలోకి అనధికారికంగా ప్రవేశించేందుకు మలివాల్ యత్నించారని, తనను దూషించారంటూ ఆమెపై బిభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిభవ్ కుమార్ అరెస్ట్
స్వాతి మలివాల్పై దాడి కేసు (assault case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీఎం నివాసానికి వెళ్లిన పోలీసులు బిభవ్ను అదుపులోకి తీసుకుని వెనుక గేటు నుంచి తీసుకెళ్లారు.
Also Read..
Bibhav Kumar | స్వాతి మలివాల్పై దాడి కేసు.. బిభవ్ కుమార్ అరెస్ట్
Deve Gowda | నేరం రుజువైతే ప్రజ్వల్పై చర్యలు తీసుకోండి.. సెక్స్ స్కాండల్ కేసుపై దేవె గౌడ