AP News | గుంటూరు నగరంలో దారుణం జరిగింది. ఓ యువకుడు వీధికుక్కపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. మే 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యానిమల్ లవర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు యువకుడిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. కుక్కను సదరు యువకుడు ఎందుకంత పాశవికంగా చంపేశాడని ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని గొల్లవారిపాలెంకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడు సితార చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆ చికెన్ షాపులో కోళ్లు మాయమవుతున్నాయి. రోజూ కోళ్లు మాయం కావడంతో గోపీకృష్ణపై యజమాని సీరియస్ అయ్యాడు. దీంతో ప్రత్యేక నిఘా పెట్టిన గోపీకి వీధికుక్కే కోళ్లను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. తన యజమానితో రోజూ తిట్టిస్తుందని దానిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మే 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో చికెన్ సెంటర్లోని ఓ కత్తితో వీధి కుక్కపై దాడి చేసి చంపేశాడు. అయితే వీధి కుక్కను అంత దారుణంగా చంపేయడం పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగహం వ్యక్తం చేస్తున్నారు.