లక్నో: ఒక వ్యక్తి గొంతు నొక్కి భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహం వద్ద పలు గంటలు ఉన్నాడు. చనిపోయిన భార్య ఫొటోలను బంధువులకు పంపాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Man Strangles Wife Sends Pictures) ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలైన 30 ఏళ్ల శ్యామ్ గోస్వామి, 28 ఏళ్ల ప్రియ మూడేళ్లుగా శంకర్ విహార్ కాలనీలో నివసిస్తున్నారు. శ్యామ్ గోస్వామికార్ యాక్ససరీస్ అమ్మే వ్యాపారం చేస్తుండగా అతడి భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నది. వారి ఆరేళ్ల కుమార్తె ఎటా జిల్లాలోని తాతయ్య వద్ద ఉంటున్నది.
కాగా, శుక్రవారం శ్యామ్ గోస్వామి దారుణానికి పాల్పడ్డాడు. భార్య ప్రియ గొంతునొక్కి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వత మృతదేహం వద్ద పలు గంటలు ఉన్నాడు. భార్య మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్లో బంధువులకు పంపాడు. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు వాట్సాప్లో ఫొటోలు చూసిన శ్యామ్ తమ్ముడు ప్రవీణ్ ఆ ఇంటికి చేరుకున్నాడు. అన్నా, వదినల మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు భార్యాభర్తల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో శ్యామ్ ఆమెను చంపి సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.