వరంగల్ : హైదరాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ( డయాగ్నస్టిక్ సెంటర్లు) ఈ నెల 9వ తేదిన ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పరీక్ష చేసి మందులు రాస్తారు. కాని ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వైద్య పరీక్షల కోసం వేలాది రూపాయలు వ్యయం చేయవలసి వస్తుందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించి డాక్టర్లు వ్రాసిన పరీక్షలు రోగులకు ఉచితంగా చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రులలోని డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా, సమీప జిల్లాల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని అన్ని హంగులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు.
వరంగల్ నగరంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య సౌకర్యాల కల్పనకు సీఎం ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలతో పాటుగా నర్సింగ్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ చేసిందని తెలిపారు. దీని వల్ల మహబూబాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరడంతో పాటుగా, మెరుగైన వ్యైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనికి తోడుగా భూపాలపల్లి, మహబూబాబాద్లో ఔషధ ఉప కేంద్రాలను ఏర్పాటు వల్ల ఔషదాల సరఫరా మెరుగు అవుతుందని తెలిపారు.