నర్సంపేట రూరల్ : ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువుకట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన అతి పురాతన రామలింగేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం జరిగిన లింగప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న దంపతులు హాజరయ్యారు. శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వేద పండితులు ఎమ్మెల్యే పెద్దికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సృష్టిలో దైవ మార్గాన్ని మించింది మరోకటి లేదని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. దైవ మార్గంతోనే అన్ని జయించవచ్చని, ఎంతటి వారైనా భగవంతుని సేవ చేయాల్సిందెనన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త దొడ్డ మోహన్రావు మాధన్నపేట చెరువు కట్టపై శివాలయాన్ని అత్యంత అద్బుతంగా నిర్మించడం హర్షించదగిన విషయమన్నారు. అనంతరం శివాలయ నిర్మాణ దాత దొడ్డ మోహన్రావును ఎమ్మెల్యే దంపతులు అభినందించారు. కార్యక్రమంలో శివాలయ నిర్మాణ దాత దొడ్డ మోహన్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.