EC | న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రతిపాదిత పథకాల కోసం సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను సేకరిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్లట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) గురువారం తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతిగా పరిగణింపబడతాయని చెప్పింది. ఎన్నికల తర్వాత లబ్ధి చేకూర్చే పథకాల కోసం వ్యక్తుల పేర్లను నమోదు చేయడానికి పక్షపాతంతో చేసే పనులకు, చట్టబద్ధమైన సర్వేలకు మధ్యనున్న గీతను మసకబార్చే కార్యకలాపాలకు వీరు పాల్పడుతున్నట్లు గమనించామని తెలిపింది.
ఎన్నికల తర్వాత లబ్ధి చేకూర్చే పథకాల కోసం వ్యక్తుల పేర్లను మొబైల్ యాప్, సర్వే, లేదా, ప్రకటనల ద్వారా నమోదు చేయడాన్ని తక్షణమే మానుకోవాలని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు చెప్పింది. ఈ విధంగా పేర్లను నమోదు చేయడం వల్ల ఓటరుకు, ఎన్నికల తర్వాత రాబోతున్నదని ప్రతిపాదించిన లబ్ధికి మధ్య లావాదేవీ సంబంధం ఏర్పడుతుందని, ఓటు వేసే పద్ధతిని ప్రభావితం చేసి ఓ విధంగా ‘నీకు ఇది – నాకు అది’ అనే ఏర్పాటును సృష్టించవచ్చునని, ఇది ప్రలోభపెట్టడమవుతుందని వివరించింది. అయితే, సాధారణ ఎన్నికల వాగ్దానాలు అనుమతించదగినవేనని స్పష్టం చేసింది.
ఓటర్ల వివరాలను సర్వేల ముసుగులో సేకరించేందుకు ప్రచురించే, ప్రచారం చేసే ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఫోన్ నంబర్ ఇచ్చి మిస్స్డ్ కాల్ ఇవ్వాలని, లేదా, ఫోన్ చేయాలని కోరుతూ ఇచ్చే ప్రకటనలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సాంఘిక-ఆర్థిక సర్వే పేరుతో ఫారాలను పంచిపెట్టి, దానిలో ఓటరు పేరు, రేషన్ కార్డు నంబరు, చిరునామా, ఫోన్ నంబరు, బూత్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, నియోజకవర్గం పేరు వంటి వివరాలను రాయాలని కోరినా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇటువంటి వివరాలను కోరే వెబ్ ప్లాట్ఫామ్స్, వెబ్ అప్లికేషన్లు, మొబైల్ యాప్లపై కూడా చర్యలకు ఆదేశించింది. కరపత్రాల రూపంలో గ్యారెంటీ కార్డులు ఇచ్చినా కొరడా ఝళిపించాలని చెప్పింది.