న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న సంగతి బయటకు వచ్చిన నేపథ్యంలో ‘కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్’లో ప్రధాని మోదీ ఫొటో మాయమవడం లోక్సభ ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది. తాజాగా కొవిడ్ టీకా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకున్నవారు.. ప్రధాని మోదీ ఫొటో అందులో లేకపోవటాన్ని గుర్తించారు. ‘ఎక్స్’ వేదికగా పలువురు యూజర్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బ్రిటన్ కోర్టు ముందు ‘ఆస్ట్రాజెనికా’ (టీకా తయారీ కంపెనీ) అంగీకరించటమే ఇందుకు కారణమని పలువురు యూజర్లు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం స్పందించింది. ఎన్నికల కోడ్లో భాగంగా కొవిడ్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించినట్టు తెలిపింది.
భారత్లో 2021లో కొవిషీల్డ్ టీకా తీసుకున్న ఓ అమ్మాయి.. కొద్ది రోజుల తర్వాత మరణించింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు ‘సీరం ఇన్స్టిట్యూట్’కు వ్యతిరేకంగా కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. టీకా పంపిణీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ గతంలో కొంతమంది తల్లిదండ్రులు కూడా కోర్టును ఆశ్రయించారు. బ్రిటన్ కోర్టులో ఆస్ట్రాజెనికా ప్రకటనతో, భారత్లో బాధిత తల్లిదండ్రుల వాదన మరోసారి తెరపైకి వస్తున్నది.
కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల్ని మోదీ సర్కార్ పాటించలేదని, టీకా సైడ్ ఎఫెక్ట్స్తో అనేకమంది గుండెపోటు, పక్షవాతం బారినపడుతున్నారని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు. టీకా సంబంధిత మరణాల కేసుల్లో బాధిత కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.