BRS | బడంగ్పేట, మే 2 : కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు నచ్చక గులాబీ గూటికి వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్తో పాటు మరి కొంత మంది గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే గులాబీ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చక పోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మండి పడుతున్నారన్నారు. చాలా మందికి రైతు బంధు పడలేదు, రైతు రుణ మాఫీ చేయలేదన్నారు. వేసవి కాలంలో కనీసం నీటి సమస్యను పరిష్కరించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే మిషన్ భగీరథ ట్యాంక్లు, పైపులైన్లు వేసి రూపాయికే నాల్లా కనెక్షన్ ఇచ్చినట్లు తెలిపారు. ఉన్న వనరులను ఎలా వాడుకోవాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు.
ప్రజలందరూ తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. పది రోజుల పాటు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకరయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, సాజత్, విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్, రవినాయక్, దేవులా నాయక్, పాండు నాయక్ తదితరులు ఉన్నారు.