బన్సీలాల్పేట్/అడ్డగుట్ట, అక్టోబర్ 25 : పద్మారావునగర్లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛ అయిన బొడ్రాయి ఏర్పాటుతో బస్తీలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఫేజ్-1, ఫేజ్-2 బస్తీలకు చెందిన వెయ్యి కుటుంబాలు ఐక్యంగా పూజలకు హాజరు కావడం విశేషం. ముందుగా చండీహోమం నిర్వ హించారు. అనంతరం బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాన్ని వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
బస్తీ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు. ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, మెట్టుగూడ కార్పొరేటర్ ఆర్.సునీత, బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి జీ.పవన్కుమార్గౌడ్, నాగులూరి సాయిబాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వయం పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
హమాలిబస్తీ ప్రజలకు తాము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, సమస్యలను పరిష్కరిస్తానన్నారు. సీఎం కేసీఆర్ హమాలీబస్తీని సందర్శించారని, ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారని, పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని ఆయన సూచించారని పేర్కొన్నారు. త్వరలోనే అందరూ ఏకాభిప్రాయానికి వస్తే అందరికీ రెండు పడక గదుల ఇండ్లు వస్తాయని చెప్పారు. వైద్యం ఖరీదు కావడంతో పేదల కోసం బస్తీ దవాఖాన ఏర్పాటు చేశామని తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే బొడ్రాయి ఏర్పాటు ఇప్పుడు నగరంలో కూడా జరుగుతుండటం శుభసూచకమన్నారు. బస్తీ వాసులు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, ఎం. సురేశ్, హరిచారి, సుధాకర్రెడ్డి, బస్తీ అధ్యక్షుడు సుభాశ్, యాదగిరి,అంజయ్య, సత్యనారాయణ, రవి, నర్సింగ్, కౌసల్య, దుర్గ, కుషాల్, శ్యామ్, వెంకటేశ్, రాములు, శ్రీను, రాజు, శివభార్గవ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.