హైదరాబాద్: కాంగ్రెస్ చెప్పినట్టు రాష్ట్రంలో మార్పు మొదలైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చిందని, ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైందన్నారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని, కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఒక్క మోటర్ కూడా కాలలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు కాలిపోతున్నాయని చెప్పారు.
‘ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రతిపక్షాలతో జైళ్లను నింపడంలో మార్పు మొదలైంది. కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయి. ఆరు గ్యారంటీల్లో ఒక్కటైనా అమలయ్యిందా?. ఐదు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి అమలు చేశారా? రెండో గ్యారంటీ రైతులకు రుణమాఫీ, బోనస్ ఇచ్చారా?, మూడో గ్యారంటీ ఇంటి స్థలం ఎవరికైనా ఇచ్చారా? నాలుగో గ్యారంటీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? ఐదో గ్యారంటీ చేయూత ఫెయిల్. గృహజ్యోతి కూడా పాక్షికంగానే అమలుచేశారు. 90 లక్షల మంది ఉంటే 30 లక్షల మందికి గృహజ్యోతి ఇచ్చారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం. కాంగ్రెస్ మోసం చేయని మనిషి లేడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టయ్యింది. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్కు శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు.. ఇప్పుడు ప్రతి ఊరి దేవుడిపై ఓట్లు. బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెబుతారు. రైతుబంధు రాలేదంటే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అన్నడు. మంత్రి తుమ్మలకే రైతుబంధు రాలేదన్నారు.
రాష్ట్రం పరువు తీసేలా సీఎం రేవంత్ భాష, వ్యవహార శైలి. రేవంత్ భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పట్ల రేవంత్ భాషను ప్రజలు ఆమోదించడం లేదు. యువతకు, భవిష్యత్ తరానికి రేవంత్ ఏం సందేశం ఇస్తున్నారు?. కేసీఆర్ చేసినవాటికి వ్యతిరేకంగా చేయడమే రేవంత్ ఉద్దేశం. కొత్త జిల్లాలను తీసేస్తామని రేంత్ అంటున్నరు. కొత్త జిల్లాల వల్ల పరిపాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. మొదటి రోజు తప్ప మళ్లి కనిపించలేదు. 3.50 లక్షల దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కరించారో చెప్పలేదు.
ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నది. పార్టీలు మారినవారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటి?. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ, బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలున్న వేదికపైనే మేనిఫెస్టో ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి. తెలంగాణలోని ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టుని కేంద్రం ఏపీలో కలిపింది. బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే కాంగ్రెస్ మద్దతిచ్చింది. దానిని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కుట్ర చేస్తున్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలుంటేనే ఉమ్మడి రాజధాని కుట్రను అడ్డుకుంటారు.
వడ్లు కొనడం చేతగాని బీజేపీ తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతుంది?. నూకలు బుక్కమన్న ఆ పార్టీకి తెలంగాణ రైతులు ఎందుకు ఓటు వేయాలి. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని ఓట్లు అడుగుతున్నది. బీజేపీ పాలనలో అదానీ ప్రపంచ కుబేరుడయ్యాడు. కేసీఆర్ కంటే ధార్మికుడు, భక్తుడు బీజేపీలో ఎవరూ లేరు. గతంలో దేవాలయాల నిధులు ఇతర అవసరాలకు వాడేవారు. కానీ, దేవాలయాలకు ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేసీఆర్ మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చే అబద్ధపు హామీలతో ప్రజల గుండెలు మండుతున్నాయ్. కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్కు అపూర్వ ప్రజాధరణ వస్తున్నది. మహిళలు, రైతులు, యువత కేసీఆర్కు స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కవ సీట్లు వస్తాయి.
రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రి చెప్పవచ్చా. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. నిర్మాణరంగంపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునప్పడ్డారు. రేవంత్ బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీ మార్పు విషయమై బీజేపీ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదు. మోదీ ఆశీర్వాదం కావాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. 8 సీట్లలో బీజేపీ గెలుపునకు రేవంత్ సహకరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలి. బీజేపీతో కలిస్తే జోడీ.. లేకుంటే ఈడీ. అక్రమ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు.
ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీలకు అండగా ఉంటుంది. కేంద్రంలో ఈసారి వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. ఎక్కువమంది బీఆర్ఎస్ ఎంపీలుంటేనే తెలంగాణ కోసం కొట్లాడతారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినవాళ్లను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తాము అత్యధిక సీట్లు గెలుస్తున్నాం.. మాకు ఆ విశ్వాసం ఉంది. మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ అన్యాయం చేసింది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ మేనిఫెస్టోలో మాట కూడా లేదు’ అని హరీశ్ రావు అన్నారు.
Live: Former Minister and MLA @BRSHarish addressing the media at Basheer Bagh, Hyderabad. https://t.co/xSPKBSeGUC
— BRS Party (@BRSparty) May 4, 2024