భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దళితులు ఇంకా వెనుకబడి ఊరికి అవతల విసిరేసినట్లే ఉన్నారని, వీరి కుటుంబాల్లో వెలుగులు నింపి, సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టేలోపు నియోజక వర్గానికి వందమందికి దళిత బంధు అందుతుందని, మళ్లీ మార్చిలో నియోజక వర్గానికి రెండువేల మందిని ఎంపిక చేసి దళిత బంధు ద్వారా వారి వెనుకబాటుతనాన్ని శాశ్వతంగా తొలగిస్తారని తెలిపారు. దళితబంధుపై హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్.. రాష్ట్రంలో ఇప్పటికే వాసాలమర్రిలో పైలట్ ప్రాజెక్టుగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక.. ఈ దళిత బంధు పథకం అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున ఈ బడ్జెట్ సమావేశాల్లోపే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి, ఈపథకం అమలు చేయాలన్నది సీఎం కేసిఆర్ ఆలోచన. ఇప్పటికే ఈ పథకం అమలైన గ్రామాలను చూసినప్పుడు ఏయే యూనిట్లు అమలు చేస్తే వారికి లాభసాటిగా ఉంటుంది.. జీవితాంతం వారికి తోడుగా ఉంటుంది అనేది తెలిసింది. ఈసారి తక్కువ మంది దళితులు ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఈ నెల 7వ తేదీనుంచి దళితుల ఖాతాల్లో దళిత బంధు డబ్బులు జమ అవుతాయి. ఇప్పటికే కలెక్టర్ల ఖాతాల్లో నగదు జమ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురు కలెక్టర్లకు 24 కోట్ల రూపాయలు వేయడం జరిగింది.. అని మంత్రి వెల్లడించారు.
గత 75 ఏళ్లుగా దళితుల కోసం ఎన్ని పథకాలు అమలు చేసినా వారి జీవితాల్లో వెలుగు రాలేదు, మార్పు రాలేదని, ఇంకా కూడా ఊరికి దూరంగా విసిరివేయబడి అణగారిన, పేదరికంలో ఉన్నారని గుర్తించి, వారిని అందరితో సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని 1200 మందికి నియోజక వర్గానికి రెండు వేలు చొప్పున 24 వేల దళిత కుటుంబాలను ఈ మార్చిలో ఎంపిక చేసుకుని వారికి శాశ్వత వెలుగులు పంచనున్న సందర్భంగా దళితులందరికీ మంత్రి సత్యవతి రాథోడ్ దళిత బంధు శుభాకాంక్షలు తెలిపారు.