కమలాపూర్, మే 20 : రూ.5 వేల లంచం తీసుకుంటూ కమలాపూర్ తహసీల్దార్ మాధవి, ధరణి ఆపరేటర్ రాకేశ్లు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా సోమవారం పట్టుబడ్డారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ కన్నూరు జీపీ పరిధిలోని రాములపల్లి గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి రాజయ్య పేరిట ఉన్న వ్యవసాయ భూమిలో మూడెకరాల 2గుంటల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఈ నెల 10న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. రిజిస్ట్రేషన్ ఫైల్ చూడకుండానే తహసీల్దార్ వారిని పంపించింది. ఈ నెల 18న గోపాల్ మళ్లీ వెళ్లాడు. రూ.6వేలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడంతో డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని గోపాల్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు తహసీల్దార్ రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ రూ.4వేలు, ధరణి ఆపరేటర్ రూ.1000 తీసుకుంటూ చిక్కారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.
తహసీల్దార్ మాధవి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. భూపాలపల్లి జిల్లా నుంచి కమలాపూర్కు బదిలీపై వచ్చినప్పటి నుంచి కార్యాలయ సిబ్బంది సైతం అవినీతికి పాల్పడడం మొదలుపెట్టారు. తహసీల్దార్ నేరుగా డబ్బులు డిమాండ్ చేయడం, సిబ్బందితో వసూలు చేయిస్తూ సొమ్ము చేసుకుంది. జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండడంతో అంబాల, కమలాపూర్, శ్రీరాములపల్లి, గూడూరు తదితర గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేశారు. వెంచర్ల నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న రియల్ వ్యాపారుల నుంచి లక్షలు వసూలు చేసిందనే ఆరోపణలున్నాయి. పైసలు ఇవ్వనిదే ఫైలుపై సంతకం చేసేది కాదని తెలిసింది. ధరణిలో తప్పుల సవరణ చేసుకునేందుకు దరఖాస్తు పెట్టుకున్న రైతుల నుంచి ఫైలుకు కొంత చొప్పున వసూలు చేసిందనే విమర్శలున్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సెల్ఫోన్లకు డిజిటల్ పేమెంట్ల నుంచి వాటాలు తీసుకునేదనే ఆరోపణలున్నాయి. పహాణీ, ఫ్యామిలీ సర్టిఫికెట్, ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా డబ్బులు ఇవ్వనిదే సిబ్బంది పనిచేయడం లేదు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి సైతం కార్యాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం పదిరోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంది. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వస్తే డబ్బులు డిమాండ్ చేసింది. గిఫ్ట్ రిజిస్ట్రేషనే కదా మేడం అంటే గిఫ్ట్ అయినా ప్రాసెస్ కోసం కావాలని రూ.6వేలు ఇవ్వమంది. అంత ఇవ్వలేనంటే రూ.5వేలు అడగడంతో ఏసీబీకి ఫోన్ చేశా.