హనుమకొండ సిటీ, నవంబర్ 19 : కొత్త మద్యం పాలసీతో చాలా మంది షాపులను దక్కించుకోవడానికి పోటాపోటీగా దరఖాస్తు చేశారు. వరంగల్ అర్బన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 65 షాపులు ఉండగా 2,983 దరఖాస్తులు వచ్చాయి. హనుమకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 25 మద్యం షాపులకు 1243, ఖిలావరంగల్లో 13 షాపులకు 531 దరఖాస్తులు, వరంగల్ అర్బన్లో 12 షాపులకు 438, కాజీపేటలో 15 షాపులకు 771 దరఖాస్తులు వచ్చాయి. 65 షాపులకు రిజర్వేషన్లో భాగంగా 26 షాపులను ఆయా కులాల వారికి కేటాయించారు. ఎస్సీలకు 10, ఎస్టీలకు 1, గౌడ కులస్తులకు 15 షాపులను కేటాయించారు. కాగా, అత్యధికంగా వడ్డేపల్లి రోడ్డులోని గెజిట్ నంబర్ 35 షాపునకు 81 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా కమలాపూర్లోని గెజిట్ నంబర్ 46 షాపునకు 19 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలో రూ.59.63 కోట్ల ఆదాయం వచ్చింది. అదృష్టం ఎవరిని వరించనుందో శనివారం లక్కీ డ్రాలో తేలనుంది. హనుమకొండలోని అంబేద్కర్ భవనంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారులు ఎంట్రీ పాసును తీసుకొస్తేనే డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుంది. డ్రాలో మద్యం షాపు వస్తే దరఖాస్తుదారుడు ఎక్సైజ్ టాక్స్లో 1/6 వంతు చలానా లేదా డీడీ రూపంలో 22వ తేదీ సాయంత్రం వరకు చెల్లించాలి.
లక్కీ డ్రా ఏర్పాట్ల పరిశీలన
వైన్ షాపుల లక్కీ డ్రా తీసేందుకు గోకుల్నగర్లోని అంబేద్కర్ భవన్లో ఆబ్కారీ శాఖ చేసిన ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం సాయం త్రం పరిశీలించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందుకు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీటింగ్ ఏర్పాట్లు, విజేతను ప్రకటించే సమయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా మైకు అనౌన్స్మెంట్ సరిగా ఉండాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. లక్కీ డ్రాలో ఉపయోగించే టోకెన్స్ సిద్ధం చేసుకున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉమ్మడి జిల్లా డీసీ, జిల్లా సూపరింటెండెంట్ సురేశ్ రాథోడ్, ఏఈఎస్ వేముల శ్రీనివాస్, సీఐలు రామకృష్ణ, అంజిత్రావు, ప్రవీణ్, చంద్రమోహన్ ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 9,765 దరఖాస్తులు
ఉమ్మడి జిల్లాలోని 292 మద్యం షాపులకు 9,765 దరఖాస్తులు వచ్చినట్లు డీసీ సురేశ్రాథోడ్ తెలిపారు. హైకోర్టు స్టేతో మంగపేట, ఏటూరునాగారం షాపులకు దరఖాస్తులు స్వీకరించలేదని పేర్కొన్నారు. దరఖాస్తుల రూపంలో రూ.193.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
పరకాలలో పెరిగిన దరఖాస్తులు
పరకాల: గతంలో కంటే మద్యం షాపులకు దరఖాస్తులు పెరిగినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కే జగన్నాథరావు తెలిపారు. గతంలో (2019-21)పరకాల ఎక్సైజ్ పరిధిలోని 20 మద్యం షాపులకు 406 దరఖాస్తులు రాగా ప్రస్తుతం 22షాపులకు 632 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 9 షాపులకు 130 దరఖాస్తులు, నడికూడ మండలంలోని ఒక షాపునకు 49, శాయంపేట మండలంలోని 3 షాపులకు 50, ఆత్మకూరు మండలంలోని 3 షాపులకు 114, దామెర మండలంలోని రెండు షాపులకు 38, గీసుకొండ మండలంలోని 4 షాపులకు 251 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటి ద్వారా రూ.12.64కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. కాగా, మొత్తం దరఖాస్తుదారుల్లో 158 మంది మహిళలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.