TS TET | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. తొలిసారిగా టెట్ పరీక్షను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు సెషన్లలో జూన్ 2వ తేదీ వరకు టెట్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు సెషన్ 2 నిర్వహిస్తున్నారు.
అయితే దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో కాకుండా.. ఇష్టానుసారం టెట్ పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు సిద్దిపేట, హైదరాబాద్లో, కరీంనగర్ జిల్లా అభ్యర్థులకు వరంగల్, హైదరాబాద్లో, ఖమ్మం జిల్లా అభ్యర్థులకు సిద్దిపేటలో.. ఇలా ఇష్టానుసారంగా పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు.